పటాన్చెరు రూరల్, జనవరి 23 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవ మరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించారు. శుక్రవారం గీతం విద్యాసంస్థ ప్రతినిధులు గిన్నిస్ రికార్డుల గురించి వివరించారు. 2016-20 బ్యాచ్లో గీతంలో చదివిన శివాలి తన తల్లితో కలిసి ఓరిగామి ప్రదర్శనలు ఇస్తున్నది. ఇప్పుడు ఓరిగామిలో రెండు సరికొత్త గిన్నిస్ రికార్డులు సాధించింది.
4700 కుందేళ్లు, 3500 తాబేళ్లను ఓరిగామిలో చేసి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించారు. శివాలి జోహ్రి, తల్లి కవితా జోహ్రిల పేరున 23 గిన్నిస్ రికార్డులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన వ్యక్తులుగా ఈ తల్లీకూతురు నిలిచారు. ఇవే కాకుండా 15 ఆసిస్ వరల్డ్ రికార్డులు, 15 యూనిక్ వరల్డ్ రికార్డులు శివాలి సాధించింది. ఓరిగామి కళకు జపాన్ కేంద్రం. పేపర్తో కళాకృతులు చేయడం ఈ కళ ప్రత్యేకత. గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం క్యాంప స్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, గణిత శాస్త్ర ఆచార్యుడు మల్లికార్జునరెడ్డి వారిని అభినందించారు.