కొల్చారం, జనవరి 4: లోక కల్యాణార్థం నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అక్షర లక్షల గాయత్రీ మహామంత్ర పునఃచరణ యజ్ఞం నిర్వహించినట్లు రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ యజ్ఞం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రపంచాన్ని నడుపుతున్నది దైవశక్తి అన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు.
స్వామి అనుగ్రహంతో సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్నారు. నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం బృందం బ్రాహ్మణోత్తములు మధుశ్రీశర్మ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరినీ కాపాడాలన్న దీక్షతో 59 మంది బ్రాహ్మణులు శంకర జయంతిని మొదలుకొని శ్రావణ పౌర్ణమి వరకు 99 రోజుల్లో 24 లక్షల జపం పూర్తి చేసినట్లు, గాయత్రీ మహా మంత్రాన్ని మూడు రోజుల పాటు సమర్పించడమే అక్షర లక్షల గాయత్రి మహామంత్ర పునఃచరణ యజ్ఞం అన్నారు.
ఈ యజ్ఞంలో నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం నాయకులు హరిప్రసాద్ శర్మ, హరికృష్ణ శర్మ, మాణిక్యశర్మ పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హాజరై మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మంజుల, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి, పైతర ఎంపీటీసీ ఆదం ఎల్లయ్య, యువ నాయకులు రవితేజరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్కుమార్, బండి రమేశ్, శివాంజనేయిలు, విశ్వపతి, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు.