పుల్కల్, ఏప్రిల్ 14: గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మండల కేంద్రం పుల్కల్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి ఎప్పుడు వెళ్లినా గ్యాస్ అందుబాటులో ఉండడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కేవైసీ పేరుతో ఆన్లైన్ చేస్తామని చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వ్యక్తి ఇంటికీ గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని ఉన్నప్పటికీ ఒకే చోటుకు గ్యాస్ వెహికిల్ వస్తున్నది. అక్కడి నుంచే వినియోగదారులు సిలిండర్ మోసుకెళ్లాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఇదేమని అడిగితే మీ గ్రామానికి గ్యాస్ బండి రాదంటూ ఖరాకండిగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సిలిండర్పై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. సబ్సిడీ కూడా సక్రమంగా పడడం లేదని, గ్యాస్ ఏజన్సీకి వెళ్తే సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ పలు గ్రామాలకు చెందిన వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెచ్పీ గ్యాస్ వినియోగదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జోగిపేట పట్టణం నుంచి గ్యాస్ తీసుకువస్తున్నాం కాబట్టి రూ.50 అదనంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. రూ.500 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,000 సిలిండర్కు చెల్లిస్తున్నామంటూ వినియోగదారులు వాపోతున్నారు. సబ్సిడీ కింద మిగతా రూ.500 బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయని చెబుతున్నప్పటికీ సబ్సిడీ పడటం లేదంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు గ్యాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ వినియోగదారులు కోరుతున్నారు.
గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు మా నుంచి రూ.50 ఇవ్వాలంటూ ఆటో డ్రైవర్ డిమాండ్ చేస్తున్నడు. లేదంటే మీకు గ్యాస్ ఇవ్వడం కుదరదు అంటూ చెబుతున్నడు. డబ్బులు ఇచ్చిన వారికే గ్యాస్ సిలిండర్ ఇచ్చి వెళ్తున్నారు.
గ్యాస్ సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖా తాలో జమ కావడం లేదు. డబ్బులు పడటం లేదని కార్యాలయానికి వెళ్తే అది మా చేతుల్లో లేదు అని సమాధానం చెబుతున్నరు. ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తే అప్పుడే తీసుకోండి అంటున్నరు.
ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఒక వేళ డ్రైవర్లు ఏమైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం. గ్యాస్ సబ్సిడీ గురించి మాకు సంబంధం లేదు. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందో మాకు తెలియదు. వేసినప్పుడు వినియోగదారుల అకౌంట్లో జమ అవుతాయి.