మెదక్రూరల్, మే 2: గరుడగంగ మంజీరా నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. 11వ రోజు మంగళవారం పేరూరు సరస్వతీ ఆలయ సమీపంలో ఉత్తరవాహిణీగా ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వేకువజామునుంచే పుణ్యస్నానాలు చేశారు. అనంతరం సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకం, సహస్ర కలశాలతో మంజునాథుడికి వేకువ జామున నుంచి శివుడికి పంచ లింగములకు మహోజలాభిషేకాలు, విశేషాలంకరణ, శివ పంచాక్షరి యజ్ఞం, శివ కేశవ రుద్రాభిషేకం, 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.
అంతకుముందు భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేసి పుష్కర దేవతకు ప్రత్యేక పూజలు చేసి, నాగుల విభూతిని ధరిస్తూ సరస్వతీ మాత, నాగదేవతను దర్శించుకున్నారు. ఈ వేడుకలకు కాలభైరవ ఆలయ వ్యవస్థాపకుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్లపాక రాజశేఖర్ హాజరుకాగా, వేద పండితులు పూర్వకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పుణ్యస్నానం చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలాఉండగా, దోర్బల రాజమౌళి శర్మ మాట్లాడుతూ పవిత్ర గంగా స్నానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో ఉండి ఆచారాలను భక్తితో నిర్వహించాలన్నారు. పుష్కర స్నానంలో పాల్గొనేటప్పుడు శుభ్రమైన వస్తాలను ధరించాలన్నారు. భక్తులు స్నానం ఆచరించేటపుడు తర్పణాలు వదలాలన్నారు. నేడు చివరి రోజు పుష్కరాలు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతీమాత, నాగదేవతను దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. సరస్వతీ పూజలో ఆలయవ్యవస్థాపకుడు బ్రహ్మ శ్రీదోర్బల రాజమౌళి శర్మ, వేదపండితుడు గుణకరశర్మ, మహేశ్శర్మ, చిలుకూరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
పుష్కరాలకు రావడం అదృష్టం
మెదక్ జిల్లాలోని గరుడ గంగా పుష్కరాలకు రావడం ఆనందంగా ఉంది. తాము ఇక్కడికి వచ్చింది ఇదే మొదటిసారి. సరస్వతీ, నాగేంద్రాలయం ఎంతో బాగుంది. నిర్వాహకులు ఏర్పాట్లు బాగా చేశారు. ప్రతి ఒక్కరూ పుష్కర స్నానం చేయాలి.
– సరిత, భక్తురాలు, జగిత్యాల జిల్లా