సంగారెడ్డి జూన్ 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సబ్బండవర్ణాలకు స్వర్ణయుగం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడిపాలనలో ప్రజా సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారు. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూసినా పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తొమ్మిదేండ్లలో సంతోషంగా ఉన్నాయి. ఆసరా, దళితబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, డబుల్బెడ్రూం లాంటి పథకాలు గడపగడపకూ చేరి సంగారెడ్డి జిల్లాలోని పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. గొర్రెలపంపిణీ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు లబ్ధిదారులకు వరంలా మారుతున్నాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలను వర్తింపజేస్తుంది. ఆసరా పింఛన్తోపాటు ఇతర సంక్షేమ పథకాల డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తున్నది. జిల్లాలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంగారెడ్డి జిల్లా ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వృద్ధులకు ఆసరా…దళితులకు అండగా దళితబంధు
ఉమ్మడి పాలనలో పాలకులు 200 పింఛన్ అందజేస్తే సీఎం కేసీఆర్ తెలంగాణలో రూ.2వేల పింఛన్ అందజేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ అందజేస్తోంది. 2014లో పింఛన్ పొందే లబ్ధిదారులు 1.20 లక్షలు ఉంటే ప్రస్తుతం 1.62 లక్షల మంది అందుకుంటున్నారు. ప్రతిఏటా ప్రభుత్వం రూ.432 కోట్ల ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు అందజేస్తోంది. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం రూ.2,458 కోట్ల పింఛన్ను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసింది. సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చిన మేరకు ఆసరా పింఛన్ వయస్సును 57కు కుదించారు. 2022లో కొత్తగా 19,410 మందికి పింఛన్లు మంజూరు చేశారు. ప్రభుత్వం 2014లో 8,443 ఎస్హెచ్జీలకు రూ.197 కోట్ల బ్యాంకు లింకేజీ ఇవ్వగా 2023లో 18,159 సంఘాలకు రూ.1056 కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితులను ఆర్థికంగా అభ్యున్నతిలోకి తీసుకువచ్చేందుకు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితులకు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేశారు.
సంగారెడ్డి జిల్లాలో మొదటివిడుతగా 444 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం వర్తింపజేశారు. సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో వందమంది చొప్పున లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేశారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడుతగా జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని 1127 మంది గిరిజనులకు 1808 ఎకరాల భూమిపై భూయాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టదారు పాసుపుస్తకాలు అందజేయనుంది. ఎస్టీ వార్షిక ప్రణాళికలో ప్రతి ఏడాది 200 నుంచి 300 మంది గిరిజన లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.4కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తోంది. ఎస్సీ సంక్షేమ శాఖ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకంలో ఇప్పటివరకు 42మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.8 కోట్లు అందజేసింది. కులాంతర వివాహాలు చేసుకున్న 56 జంటలకు రూ.1.40 కోట్లు అందజేసింది. ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 100మంది విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, సీఎం స్కాలర్షిప్ ద్వారా విదేశాల్లో చదువుకునేందకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి గొర్రెల పంపిణీ పథకంలో గొర్రెల యూనిట్లను అందజేస్తోంది.
కల్యాణలక్ష్మితో పేదింట్లో పెండ్లికాంతులు
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీముబారక్లతో పేదింట్లో పెండ్లి భాజాలు మోగుతున్నాయి. కల్యాణలక్ష్మీ కింద సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 39 వేలమందికి రూ.382 కోట్లు అందజేశారు. షాదీముబారక్ కింద 10,715 మందికి రూ.99.39 కోట్ల ఆర్థికసాయం అందజేశారు. సీఎం కేసీఆర్ బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏటా 25వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం రూ.5.56 కోట్ల కిట్లు అందజేసింది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగశిశువు జన్మిస్తే రూ.12వేలు నగదు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. కాగా ఇటీవలే ప్రభుత్వం గర్భిణులకు పౌష్టికాహారం అందజేసేందుకు వీలుగా న్యూట్రిషన్ కిట్లను దశాబ్ది ఉత్సవాల్లో పంపిణీ ప్రారంభించనుంది.
నెరవేరుతున్న సొంతింటి కల
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్బెడ్రూం పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుంది. డబుల్బెడ్రూం పథకం కింద సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం రూ.338.110 కోట్లతో 5,920 డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.210 కోట్లతో జిల్లాలో 3,498 నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 3,450 డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.