సర్కారు పాఠశాలల్లో నిర్వహణ ఖర్చుల కోసం అందజేస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కొత్తగా పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం)ను అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి పాఠశాల అవసరాలకు ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినా, ఎవరికైనా డబ్బులు చెల్లించినా.. వారి పేరు, బ్యాంక్ ఖాతా, సంబంధిత వస్తు సామగ్రి బిల్లును ఆన్లైన్లో పొందుపర్చాలి ఉంటుంది. తదనంతరం ఆన్లైన్ ద్వారా వారి ఖాతాకు డబ్బులు జమ చేస్తారు. ఈ విధానంతో ఎక్కడా డబ్బులు నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉండదు. ప్రతి పైసా డిజిటల్ రూపంలో ఖర్చు పెట్టడంతో లెక్క పక్కాగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో సమర్పించాలి.
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రతి విద్యాసంవత్సరం చెల్లించాల్సిన గ్రాంట్ను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. నిధులు ఇంతకు ముందు పాఠశాలల ఖాతాలో జమ చేసేది. నిధుల సద్వినియోగానికి, పారదర్శకతకు ప్రభుత్వం కొత్తగా పీఎఫ్ఎమ్ఎస్(పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం) అమలులోకి తెచ్చింది. దీంతో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనున్నది. మెదక్ జిల్లాలో విద్యాశాఖ జిల్లా ఆర్థిక గణాంక అధికారులు (ఎఫ్ఏవో) ప్రధానోపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించి వినియోగంపై అవగాహన కల్పించారు.
వివరాలు ఇలా పొందుపర్చాలి
పాఠశాల అవసరాలకు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా, అవసరానికి ఎవరికైనా డబ్బులు చెల్లించినా.. వారి పేరు, బ్యాంక్ ఖాతా సంబంధిత సామగ్రి, సేవా బిల్లును ఆన్లైన్లో పొందుపర్చాలి. తదనంతరం వారి ఖాతాకు ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేస్తారు. పాత పద్ధతిలో సంబంధితులకే నేరుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించడంతో కొందరు తప్పుడు బిల్లులు సమర్పించి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డరనే ఆరోపణల్నుయి. దీంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా స్టేషనరీ, మైనర్ మరమ్మతుల బిల్లుల చెల్లింపు, ప్రయోగ పరికరాల కొనుగోలు వంటి సమస్యలు పరిష్కారం కానున్నాయి. పాఠశాలలో విద్యార్థులు సంఖ్య ఆధారంగా రూ.10 వేల నుంచి రూ. 50 వేల వరకు ప్రభుత్వం అందజేస్తుంది.
మంచి నిర్ణయం..
ప్రభుత్వ మంచి నిర్ణయం తీసుకున్నది. పాఠశాల గ్రాంట్ నిధులను దేని కోసం ఖర్చు చేసినా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త పద్ధతిలోనే చెల్లింపులు చేయాలి. బిల్లుల వివరాలను ఆన్లైన్లో అందజేయాలి. హెచ్ఎం ఏవైనా ఖర్చులు భరించినా నిబంధనలకు లోబడి వారి బ్యాంక్ ఖాతాల వివరాలను సమర్పించి డబ్బులు పొందవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం రెండు విడతల్లో నిధులు మంజూరు చేసింది.
– సుదర్శనమూర్తి, జిల్లా ఆధ్యక్షుడు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్