సీఎం కేసీఆర్ ఈ నెల 22న పటాన్చెరుకు రానున్నారు. పట్టణంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను ప్రారంభించి, ఐనోల్ గ్రామంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల శ్మశానవాటికలకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాల పత్రాలను ఆయా మతపెద్దలకు అందజేస్తారు. రామచంద్రాపురం మండలం కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పటాన్చెరులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ శరత్కుమార్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎస్పీరమణ కుమార్లతో సమావేశం నిర్వహించారు.
– పటాన్చెరు, జూన్ 19
పటాన్చెరు, జూన్ 19: పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరైందని, ఈ నెల 22న దవాఖాన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్ పటాన్చెరు పట్టణానికి వస్తున్నారన్నారు. రింగురోడ్డు మార్గం ద్వారా వచ్చి రామచంద్రాపురం మండలంలోని కొల్లూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా పటాన్చెరుకు వచ్చి ప్రభుత్వ పీసీబీ, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 200 పడకల దవాఖానకు సీఎం భూమి పూజ చేస్తారన్నారు. దీంతోపాటు 150 అడుగుల ఎత్తున్న జాతీయ జెండాను సీఎం ఆవిష్కరిస్తారన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారన్నారు. ఐనోల్ గ్రామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల శ్మశానవాటికలకు కేటాయించిన ఐదెకరాల స్థలాల పత్రాలను ఆయా మత పెద్దలకు అందజేస్తారన్నారు. నియోజకవర్గంలో కాలుష్యంతో నష్టపోయిన ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు ఈ దవాఖానను రూ.184 కోట్లతో నిర్మిస్తున్నదన్నారు. 75 శాతం నిధులు పీసీబీ, 25 శాతం నిధులు తెలంగాణ సర్కారు భరిస్తున్నదన్నారు. నిమ్స్, ఉస్మానియా, గాంధీ దవాఖానల స్థాయిలో ఇక్కడ వైద్య సేవలుంటాయని వివరించారు. దవాఖానకు నియోజకవర్గంలో ఏ మూల నుంచైనా 20 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు.
సీఎం సభకు భారీ ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన తరువాత సభను ఏర్పాటు చేసేందుకు పటాన్చెరులో ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 30 నుంచి 40 వేల మందితో సభను నిర్వహిస్తామన్నారు. దవాఖాన ఖాళీ స్థలంలోనే సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షం పడినా ప్రజలు తడవకుండా షెడ్లు వేస్తున్నామన్నారు. సీఎం సభను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరుకావాలని కోరా రు. ప్రతి మండలం నుంచి బైక్ ర్యాలీ వస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ ఈర్ల దేవానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, అంతిరెడ్డి, మాణిక్రెడ్డి, దశరథరెడ్డి, సర్పంచ్ కృష్ణయాదవ్, బురిగారి వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గడ్డయాదయ్య, మెరాజ్ఖాన్, రామకృష్ణ ముదిరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో ఈ నెల 22న సీఎం కేసీఆర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కదిలింది. కొల్లూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు. పటాన్చెరులోని దవాఖాన స్థలాన్ని కలెక్టర్ డాక్టర్ శరత్కుమార్, ఎస్పీ రమణకుమార్ పరిశీలించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సలహాలు, సూచనల మేరకు సభలో ఏర్పాట్లపై చర్చించారు. సభా స్థలి, శిలాఫలకం ఏర్పాటు, ఇతర భద్రతా అంశాలను ప్రస్తావించారు. సభ ఏర్పాట్లు, ట్రాఫిక్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ పటాన్చెరు ఎంపీపీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీఎం అండ్హెచ్వో గాయత్రీదేవి, డీపీవో సురేశ్మోహన్, డీఎండబ్ల్యూవో అరుణ్కుమార్, మెప్మా పీడీ గీత, డీఎస్పీ భీంరెడ్డి, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ సైనికుల్లా విధులు నిర్వహించాలి
గుమ్మడిదల, జూన్ 19: ఈ నెల 22న పటాన్చెరులో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గుమ్మడిదలలోని చంద్రారెడ్డి గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ మండల స్థాయి నాయకుల సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. సీఎం కేసీఆర్ రాకతో నియోజకవర్గం గులాబీమయంగా మారాలన్నారు. పటాన్చెరులో నిర్మించే ఈ దవాఖానతో నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణా విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ మంజులా వెంకటేశ్గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు గోవర్ధన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆలేటి శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్షుడు మహ్మద్హుస్సేన్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఫయాజ్ షరీఫ్, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.