ఆయిల్పామ్ రైతుకు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, డ్రిప్ అందిస్తూ సాగును ప్రోత్సహిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్పామ్ కర్మాగారానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో అన్నదాతల అధిక ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్పామ్ పంటకు అధిక డిమాండ్ ఉందని, సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. నర్మెటలో నిర్మించే ఫ్యాక్టరీలో అధునాతన సౌకర్యాలు, క్రూడ్ ఆయిల్తో పాటు రిఫైనరీ యంత్రం ఉంటుందన్నారు. రూ.300 కోట్లతో నిర్మించే ఫ్యాక్టరీ పనులు ఏడాదిలోపు పూర్తిచేయిస్తామని తెలిపారు.
– సిద్దిపేట అర్బన్/నంగునూరు, సెప్టెంబర్ 30
పంట సాగుకు మన నేలలు అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణలో 20లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వరి, పత్తి పంటలతో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల ఆదాయం వస్తే పామాయిల్తో రూ.లక్షా యాభై వేలు వస్తాయన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి రైతులు సాగుచేసేలా ప్రోత్సహించాలన్నారు.
సిద్దిపేట అర్బన్/నంగునూరు, సెప్టెంబర్ 30: ఆయిల్పామ్ సాగు అన్నదాతలకు అభయహస్తమని, ఈ పంట సాగుతో రైతన్నకు ఆదాయం బాగుంటుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్పామ్ కర్మాగారానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు ఎంతో శుభదినమని రూ.300 కోట్లతో నిర్మించే ఈ ఆయిల్పామ్ ఫ్యాక్టరీ రైతుల ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలోని ఆయిల్పామ్ రైతులకు ఆయిల్పామ్ తోటలోనే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.
ఆయిల్పామ్ సాగులో చేయాల్సిన మెళకువలను రైతులకు మంత్రి వివరించారు. ప్రతి ఒక్క రైతు ఆయిల్పామ్ డెయిరీని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని, అదే విధంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగు నీరు తీసుకొచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చారన్నారు. వరి, పత్తి లాంటి పంటలతో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు మాత్రమే వస్తాయి. కానీ పామాయిల్తో ఎకరానికి రూ.లక్షా యాభై వేలు సంపాదించవచ్చన్నారు. అకాల వర్షాల వల్ల, ధర లేక, చీడ పీడలు, అడవి పందులు, కోతుల బెడదతో వరి, పత్తి లాంటి పంటలకు ఇబ్బంది ఉంటుంది. ఆయిల్పామ్కు అలాంటి సమస్యలు ఉండవన్నారు. మూడేండ్ల వరకు కాపాడితే ప్రభుత్వ ఉద్యోగిలాగా ప్రతినెలా ఆదాయం వస్తుందన్నారు. ప్రతి మనిషి దేశంలో ఒక సంవత్సరంలో 19 కిలోల నూనె తింటున్నారు. కానీ దేశంలో 40శాతం మాత్రమే ఉందని.. 60శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. పాలకులను ముందుచూపు లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందన్నారు. ఎక్కువ పంట పండితే డిమాండ్ ఉంటదా.. ధర ఉంటదా, ఉండదా అనే అనుమానం రైతులకు ఉండవద్దన్నారు. పామాయిల్ అవసరం చాలా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో 20 లక్షల ఎకరాలు పామాయిల్ సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారన్నారు.
ఆయిల్పామ్తో రైతులకు అధిక ఆదాయం రావడం మాత్రమే కాకుండా పర్యావరణానికి ఎంతో అనుకూలమైందన్నారు. హెక్టార్ పామాయిల్ తోట 62 మెట్రిక్ టన్నుల కార్బన్డైఆక్సైడ్ను పీల్చుకొని, 18 టన్నుల ఆక్సిజన్ అందిస్తుందని మంత్రి చెప్పారు. ఆయిల్పామ్ సాగు పర్యావరణ సమతుల్యత కాపాడుతుందన్నారు. వరి, ఇతర పంటలు మార్కెట్కు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడుతుంది. కానీ ఆయిల్పామ్ సాగుకు ఏ ఇబ్బందులు ఉండవన్నారు. గాలిలో తేమశాతం ఉన్న వద్దనే పామాయిల్ తోటలు పండుతాయని.. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిర్మించిన మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, మిషన్ కాకతీయతో బాగు చేసిన చెరువుల ద్వారా గాలిలో తేమశాతం పెరిగి పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే ఇన్ని రిజర్వాయర్లు, చెరువులు బాగయ్యేవా… ఆయిల్పామ్ సాగు చేసుకునేవాళ్లమా అని మంత్రి అడిగారు. కాంగ్రెస్ హయాంలో ఎవరైనా చనిపోతే సబ్స్టేషన్ వాళ్లను బతిమాలి కరెంట్ వేసుకొని స్నానం చేసే పరిస్థితి ఉండేదన్నారు. వారి హయాంలో కనీసం ఉదయం నుంచి సాయంత్రం దాకా కరెంట్ ఉండేదా అని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ భగవంతుడి స్మరణ చేస్తాడు కాబట్టే రాష్ట్రంలో కరువు అనే మాట లేదన్నారు. ఇప్పటికే జిల్లాలోని మల్లన్నసాగర్లో 15 టీఎంసీలు, రంగనాయకసాగర్లో 3 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్లో 8 టీఎంసీలు నింపి ఉంచామన్నారు. యాసంగిలో అవసరమైనప్పుడు ఆ నీటిని విడుదల చేస్తామన్నారు. రూ.300 కోట్లతో నిర్మించే ఈ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించామని, ఒక సంవత్సరంలోపు పూర్తవుతుందన్నారు. ఇంత పెద్ద ఆయిల్పామ్ ఫ్యాక్టరీ దేశంలోనే లేదని.. ఒక గంటకు 120 టన్నుల పామాయిల్ క్రషింగ్ చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా 60 మెట్రిక్ టన్నులు, 90 మెట్రిక్ టన్నులు క్రషింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయని ఇది వాటికంటే పెద్దదన్నారు. ఇక్కడ నిర్మించే ఫ్యాక్టరీలో అన్ని రకాల అధునాతన సౌకర్యాలు ఉంటాయని, క్రూడ్ ఆయిల్తోపాటు రిఫైనరీ యంత్రం కూడా ఇక్కడే ఉంటుందన్నారు. అదేవిధంగా ఆయిల్పామ్ పిప్పితో కోళ్లకు, పశువులకు దాణా తయారవుతుందన్నారు. మిగిలిన పిప్పిని 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే యంత్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కర్మాగారం నుంచి వచ్చే నీటిని మళ్లీ ఇక్కడే శుద్ధి చేసి ఉపయోగించుకుంటారన్నారు. ఇక్కడ తయారైన ఆయిల్ ప్యాకెట్ మన ఊర్లోకే వస్తుందన్నారు. స్వామినాథన్ మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తమిళనాడు వెళ్లిన మంత్రి నిరంజన్రెడ్డి రాలేకపోయారని, ఇక్కడ కర్మాగారం ఏర్పాటు చేయడం మంత్రి నిరంజన్రెడ్డి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్కు మంత్రి హరీశ్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ వంగ నాగిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమ, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, రా్రష్ట్ర ఆయిల్పామ్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దిపడగ కిష్టారెడ్డి, అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీ, ఏఎంసీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
సిద్దిపేట ప్రాంత రైతులకే కాకుండా చుట్టుపక్కల ఆరు జిల్లాల ఆయిల్పామ్ రైతులకు నేడు ఎంతో శుభదినమని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయిల్పామ్ కార్మాగారానికి 65 ఎకరాల స్థలం కేటాయించినందుకు మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 30 ఏండ్ల కిందట ఖమ్మం జిల్లాలో రైతులు ఆయిల్పామ్ సాగు చేసి ఎంతో ఆర్థికాభివృద్ధి సాధించారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్నారని, పామాయిల్ సాగులో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలవాలని కోరారు. 12 నుంచి 15 నెలల్లో ఆయిల్పామ్ కర్మాగారం ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. రైతులకు మేలుచేసే ఆయిల్పామ్ కర్మాగారానికి శంకుస్థాపన చేసినందుకు రైతుల పక్షాన మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలను రైతులు ఉపయోగించుకొని అధికసంఖ్యలో ఆయిల్పామ్ను సాగు చేయాలని కోరారు. ఇతర రాష్ర్టాలతోపాటు ఇతర దేశాలకు తెలంగాణ రాష్ట్రం ఆయిల్పామ్ గెలలను ఎగుమతి చేసే స్థితికి రైతులు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఇప్పటివరకు సిద్దిపేట జిల్లాలో 11వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. మరింత పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం కూడా ఆయిల్పామ్ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తూ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. ఆయిల్పామ్ సాగులో అంతర పంటలు వేయడంతో అదనపు ఆదాయం కూడా వస్తుందన్నారు. పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు అంతర పంటలుగా సాగుచేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఖమ్మం తర్వాత సిద్దిపేట జిల్లాలోనే ఆయిల్పామ్ను అధికంగా సాగు చేస్తున్నారన్నారు.
తెలంగాణ చరిత్రలో ఇదొక మైలురాయి అని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ హనుమంతరావు అన్నారు. సిద్దిపేట ప్రతి అంశంలో రాష్ర్టానికే దిక్సూచిలా ఉంటుందని చెప్పారు. ఆయిల్పామ్ను మించిన పంట లేదు. ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న పంట అని, జిల్లాలోని ప్రతి రైతుతో నేరుగా మంత్రి హరీశ్రావు టెలీకాన్ఫరెన్స్లో పంట గురించి వివరిస్తారని చెప్పారు. మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతోనే ఆయిల్పామ్ సాగులో సిద్దిపేట జిల్లా ముందంజలో ఉందన్నారు. రైతులు అధికసంఖ్యలో ఆయిల్పామ్ సాగు చేసుకోని రాబడులు పొందాలని కోరారు.