అందోల్, మార్చి 29 : కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాలొచ్చాయని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి శుక్రవా రం జోగిపేటలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానా ద్వారా ఖర్చు పెట్టలేదని, కార్పొరేషన్ల ద్వారా చేస్తున్నదని విమర్శించారు.
వ్యయం, ఖర్చులపై సరైన అవగాహన లేని పాలకులు ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయరన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్కు అండగా ఉండాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్వప్రయోజనాల కోసం పని చేస్తారని, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ స్థానికుడు, ఉద్యమకారుడు అని, మనకు అండగా ఉంటారని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.