మెదక్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన మెదక్ మెడికల్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలోని 33 జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా మెదక్కు మెడికల్ కళాశాల కేటాయించి, నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేశారని, మూడు నెలల క్రితం శంకుస్థాపన కూడా చేశారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో 100 సీట్లతో కళాశాలను ప్రారంభించాలని పద్మాదేవేందర్రెడ్డి కోరారు. మెదక్ జిల్లా ప్రాంత ప్రజలు వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారన్నారు. అయితే, ఇప్పటికే సెంట్రల్ కమిటీ వచ్చి సమీక్ష చేయాల్సి ఉందని తెలిపారు. తమ సర్కార్ మంజూరు చేసిన కాలేజీని రద్దు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగితే గళమెత్తుతామని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని స్థానిక ఎమ్మెల్యే వినియోగించుకోవాలని సూచించారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని తెలిపారు. కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన నిధులను యథావిధిగా విడుదల చేయాలని కోరారు. మెదక్ అభివృద్ధిని పట్టించుకోవాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తామన్నారు. మెదక్ పట్టణంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వంద శాతం డెలివరీలు జరుగుతున్నాయని, గర్భిణులు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు ఎంసీహెచ్ను ఏర్పాటు చేసిందని, అందులో 25 శాతం శానిటేషన్ను తగ్గించడం తగదన్నారు. అక్కడ పనిచేసే కార్మికులకు కూడా జీతాలు తగ్గుతున్నాయని తెలిపారు. వెంటనే దానిపై సమీక్ష చేసి రివైజ్ చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని తెలిపారు. సమావేశంలో జడ్పీచైర్పర్సన్ హేమలతాగౌడ్, వైస్చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జడ్పీటీసీ సుజాతా శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, వంజరి జయరాజ్, కిశోర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, లింగారెడ్డి, కృష్ణ, జయరాంరెడ్డి, కిష్టయ్య, మోహన్, గట్టేశ్, సాయిలు, నవీన్, పోచయ్య, ముకుందం, బాల్రాజ్, కిషన్ పాల్గొన్నారు.