టేక్మాల్, జనవరి 11: ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీల మాటలు నీటి మూటల వలె తేలిపోయాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఎకరానికి రూ. 10వేల రైతుబంధు ఇవ్వగా, తాము ఎకరానికి రూ.15వేలు ఇస్తామని మాయమాటలతో రైతులను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రూ.15వేలకు బదులుగా రూ. 12వేలు ఇస్తామని రైతులకు వెన్నుపోటు పొడిచిన వైఖరిని నిరసిస్తూ మెదక్ జిల్లా టేక్మాల్లో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్పై రాసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలులో విఫలమైందన్నారు. మాయ మాటలు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో రుణమాఫీ కాలేని రైతులు అనేక మంది ఉన్నారని, పార్టీ మాటలు నమ్మి మోసపోయామని కాంగ్రెస్ కార్యకర్తలే బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు వస్తలేదని, కేసీఆర్ కిట్టు వస్తలేదని, కల్యాణలక్ష్మి తులం బంగారం వస్తలేదన్నారు.
ఈ వానకాలం ధాన్యం కొనుగోలులో సగానికిపైగా ధాన్యం దళారుల పాలైందని చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేని రైతులు దళారులకు ధాన్యాన్ని అమ్ముకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో 24గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తే, ఇప్పుడు ఎప్పుడు వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఆశపడితే గోస పడతాం అనే విషయం నిజమైందన్నారు.
ఇప్పుడు ఇస్తామంటున్న రైతుభరోసా కూడా కేవలం స్థానికల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన తప్ప రైతుల శ్రేయస్సు కోసం చేసింది కాదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. ఆందోళనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్రెడ్డి, నాగభూషణం, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్రెడ్డి, పార్టీ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, నాయకులు సిద్దయ్య, సలీం, భాస్కర్, రవి, సుధాకర్, శ్రీనివాస్, హనుమగౌడ్, వెంకట్గౌడ్, బన్నయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.