రామాయంపేట, మే 5: అబద్ధాల కాంగ్రెస్ను బొందపెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట దొంగ హామీలు ఇచ్చి ఓట్లేసుకుని గద్దెనెక్కి ఇప్పుడు ఏఒక్క హామీని నెరవేర్చకుండా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న సీఎం రేవంత్రెడ్డిని నిలదీయాలన్నారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేటలో నిర్వహించిన రోడ్షోకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లేనిపోని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. ఆరుగ్యారెంటీలు ఇచ్చి ముఖం చాటేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేలు, నిరుద్యోగులకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడని ఆరోపించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు.
ఏ ఒక్క హామీనైనా నెరవేర్చాడా మీరే చెప్పండి మళ్లీ ఓట్లకు వచ్చి బీఆర్ఎస్పై తిట్లు, హామీలు నెరవేరుస్తానని దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటున్నాడని, ఇదా కాంగ్రెస్ నైజం అని విమర్శించారు. బిడ్డా రేవంత్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామన్నారు. కేసీఆర్ హయాంలో మహిళలకు పింఛన్లు, గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయం, శిశువులకు కేసీఆర్ కిట్లు ఇచ్చారన్నారు. రైతుబంధు సైతం ఆపకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. బ్రోకర్ మాటలు మాట్లాడే వ్యక్తులకు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఎందుకు ఓటెయ్యా లని హరీశ్రావు ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంధర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పుట్టి యాదగిరి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నాగరాజు, నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభావతి, సంపత్, స్వామి, శ్రీనుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.