గజ్వేల్, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు రూ.2500 అందజేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా పాలన ప్రజలకు దగ్గరకావడం లేదన్నారు.
సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆసరా రూ.4 వేలు, రైతు భరోసా రూ.15 వేలను వెంటనే ఇవ్వాలన్నారు. పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పింఛన్ డబ్బులు అందజేయాలన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం రాకతో రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొమ్మిదిన్నరేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ను రేవంత్రెడ్డి దూషించడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది ఆటో డ్రైవర్ల కటుంబాలు వీధినపడ్డాయని, ఈవీఎంలు కట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో రాష్ట్ర రైతాంగానికి ఆదుకొని వారికి అండగా నిలబడి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణను కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. కోటి ఎకరాల మాగాణిగా మార్చి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే విధంగా రైతులకు సాగునీరందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఉద్యమకారుడు కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లి, కొండపొచమ్మసాగర్ ద్వారా హల్దీవాగులను నింపి వేలాది ఎకరాలకు జీవం పోసి సస్యశ్యామలం చేశారన్నారు. సమావేశంలో నాయకులు గుంటుక రాజు, నాగరాజు పాల్గొన్నారు.