సిద్దిపేట, ఏప్రిల్ 25 : ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్లో గల ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసంలో బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, లోక లక్ష్మీరాజ్యం, భూపేశ్, నముండ్ల రామచంద్రం, ఎర్ర యాదయ్యలతో కలిసి మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 1,20,000 ఇస్తే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకరాకు రూ.6.30 లక్షలు ఇచ్చారన్నారు. సింగూరు భూ నిర్వాసితులకు భూ పరిహారం అందించామన్నారు. రఘునందన్ రావు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూపాయలు 6:30 లక్షలు ఇచ్చామన్నారు.
వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ప్రభుత్వ ఆదేశాలను, విధానాలను అమలు చేశారని ఏ కలెక్టర్ ఉన్నా అదే పని చేస్తారని అన్నారు. భూ నిర్వాసితులకు వెంకట్రామిరెడ్డి అన్యా యం చేశాడనిరఘునందన్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దిపేటకు రైలు కావాలన్నది ఇకడి ప్రజల 40 ఏండ్ల కలను నెరవేర్చింది కేసీఆర్, హరీశ్రావు అన్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ ప్రతిపాదనలు చేసి పంపారన్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి భూసేకరణతో పాటు రు. 800 కోట్లు రాష్ట్ర ప్రభు త్వం చెల్లించిందన్నారు. తప్పుడు హామీలు ఇవ్వడం వల్లనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రఘునందన్ రావుకు కర్రు కాల్చి వాతపెట్టారన్నారు. నాయకులు ముత్యాల కనకయ్య, బెల్లరాములు, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాలొన్నారు.