అందోల్, ఏప్రిల్ 6: పంటలకు సాగునీరివ్వకుండా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ పంటలను ఎండబెడుతూ రైతుల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం రైతులకు మద్దతుగా జోగిపేట అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన రైతుదీక్షలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో తెలంగాణను ఎడారిగా మార్చిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు.. ధాన్యరాశులు దర్శనమిస్తే.. ఇప్పుడూ నీళ్లు లేకా నెర్రలుబారిన పొలాలు… ఎండిపోయిన కాల్వలు దర్శనమిస్తున్నాయని, ఇవన్నీ కాంగ్రెస్ చేతగానితనం వల్లే జరిగాయన్నారు. పాలన వ్యవస్థను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెడుతున్నారు తప్పా.. సీఎం ఒక్కసారైనా ప్రజలు, రైతుల సమస్యలపై చర్చించారా అని ప్రశ్నించారు. మంత్రులు సైతం స్వంత పనులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజాసమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రాధాన్యత మరెవ్వరికీ ఇవ్వలేదని, ఆయన ముందు చూపు, రైతులపై ఆయనకున్న శ్రద్ధ కారణంగా పదేండ్లపాటు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టి కాల్వల ద్వారా పంటలకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్దని, ఆయన చొరవతో అందోల్ నియోజకవర్గం సైతం ఎంతో సస్యశ్యామలమైందన్నారు. సింగూర్ కాల్వల ద్వారా పంటలకు నీరందించడంతోపాటు తాలెల్మ ఎత్తిపోతలతో అందోల్, అల్లాదుర్గం, వట్పల్లి, టేక్మాల్ మండలాల రైతులకు సాగునీరందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతాంగాన్ని నీరుగారుస్తూ వారి ఉసురు పోసుకుంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి రైతులు కర్రుకాల్చి వాతపెడుతారన్నారు. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని, మీకు అండగా బీఆర్ఎస్ ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, ప్రాధాన కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, మాజీ ఎంపీపీ రామాగౌడ్, నాయకులు లింగాగౌడ్, నారాయణ, నాగభూషణం, వెంకటేశం, వీరారెడ్డి, అశోక్గౌడ్, బుద్ధిరెడ్డి, బస్వరాజ్, సాయికుమార్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.