హుస్నాబాద్, ఏప్రిల్ 28: హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్నది. నిత్యం జేసీబీలు, ప్రొక్లెయినర్లు పెట్టి వందలాది ట్రాక్టర్లు, పదులకొద్దీ టిప్పర్లు పెట్టి మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మట్టి తరలించేందుకు తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉండగా నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఒకవైపు ఎల్లమ్మ చెరువుతో పాటు గాంధీనగర్లోని చెరువుల్లోంచి మట్టిని ఇటుకబట్టీలకు తరలించడం, మరోవైపు మత్తడిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న యేనె మట్టిని, ఇతర ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లోని మట్టిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం వందలాది ట్రిప్పుల మట్టి తరలిపోతున్నా అటు రెవెన్యూ అధికారులు గానీ, ఇటు మైనింగ్ అధికారులు గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హుస్నాబాద్ పట్టణ శివారులో కొత్తగా వెలుస్తున్న వెంచర్ల డెవలప్మెంట్తోపాటు కొత్త ఇండ్ల నిర్మాణాలకు కావాల్సిన మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. పట్టణ శివారుతోపాటు ఇటీవల పందిల్ల, బంజేరుపల్లి తదితర గ్రామాల శివారుల్లోనూ కొత్త వెంచర్లు పెట్టి మట్టి పోసి చదును చేసి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. దీంతో మట్టికి డిమాండ్ పెరిగింది. ఒక్కో ట్రిప్పుకు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు వినియోగదారులు ముందుకురావడంతో వాహనాదారులు, జేసీబీల యజమానులు కుమ్మక్కై అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా మట్టిని తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండతోనే మట్టి దందా నడుస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. మట్టి దందా ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చెరువులు, కుంటలు, యేనె ప్రాంతాలు, గుట్టలు ధ్వంసమై పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
మట్టిని గానీ, ఇసుకను గానీ తరలించాలంటే రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరి. అనుమతులు ఉంటేనే వాహనాల్లో మట్టి, ఇసుక తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మట్టి, ఇసుక తీయడం వల్ల పర్యావరణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అలా జరుగకుండా ఉంటుందని నిర్ధారించుకున్నాకే అధికారులు మట్టి తీసుకెళ్లేందుకు అనుమతులు ఇస్తారు. ఇందుకు మట్టి అవసరం ఉన్నవాళ్లు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. కానీ సెలవు రోజుల్లో హుస్నాబాద్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నారు. మట్టి దందా చేస్తున్న వారి వల్ల వినియోగదారులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది. అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కూడా గండిపడుతోంది. ఇప్పటికైనా అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, నిరంతరం మట్టి, ఇసుక దందాపై నిఘాపెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న మట్టి దందాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం వందలాది ట్రిప్పుల మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఇతర దళారులు మట్టిని తరలిస్తున్నారు. మట్టి అవసరం ఉన్న వాళ్లు అధికారులకు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు వస్తాయి. దానికి అనుగుణంగా మట్టిని వా డుకోవచ్చు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా పర్యావరణం దెబ్బతినేలా మట్టి దందా నడుస్తున్నందున అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మట్టి అనేది దొరకకుండా పోతుంది.