సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఆద్యాంతం ప్రజల హర్షద్వానాలు.. నినాదాల మధ్య సాగింది. యువకులు, మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. గ్రామాలకు గ్రామాలే సభకు తరలివచ్చాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఆటో, బస్సు, సైకిల్ మోటరు ఏది దొరికితే దాన్ని పట్టుకొని సీఎం సభకు వచ్చారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోగానే యువకులు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజిళ్లు, చప్పట్లు, జై కేసీఆర్.. జై హరీశ్రావు.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లోని కుల సంఘాలు కులవృత్తులకు చిహ్నాలుగా భావించి జలపందిరులు.. బోనాలు, ఒగ్గు డోళ్లు.. డప్పు చప్పుళ్లతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సిద్దిపేటలోని దారులన్నీ సభ వైపే సాగాయి. పట్టణమంతా ర్యాలీలు, పాదయాత్రలు, డీజే సౌండ్లు.. కళాకారుల ఆటపాటలతో గులాబీమయమైంది. సభా ప్రాంగణానికి ప్రజలు మధ్యాహ్నం 2 గంటల నుంచే చేరుకున్నారు.
-సిద్దిపేట/సిద్దిపేటరూరల్/ సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే సభలో పెద్ద ఎత్తున నినాదాలు.. హర్షద్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. యువకులు పెద్దఎత్తున సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధ్దిల్లాలంటూ.. హరీశన్న జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా ప్రాంగణంతోపాటు చుట్టూ రెండు కిలోమీటర్ల మేర జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్ సభా వేదికకు చేరుకోగానే పలువురు నాయకులు సీఎం కేసీఆర్కు పాధాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మైనార్టీ నాయకుడు మసూద్అబి సీఎం కేసీఆర్కు దట్టి కట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించగానే సభ ప్రాంగణం మొత్తం నినాదాలతో మార్మోగింది.
మంత్రి హరీశ్రావు పేరు ప్రకటించగానే సభ మొత్తం ఈలలు, జిందాబాద్లతో యువత నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు యువకులు ఉత్సాహంగా ఈలలు వేస్తూ నినాదాలు చేయడంతో నేను ఈడ మొత్తుకునుడు.. మీరు ఆడ మొత్తుకునుడు ఏం అర్థమైతది.. ఉత్సాహం ఉంటే ఆపుకోవాలి.. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరం గజంగజం ఎత్తు దుంకుదాం అనడంతో సభ మొత్తం నవ్వులు, చప్పట్లతో మార్మోగింది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఆయా గ్రామాల పేర్లు ప్రస్తావించినప్పుడల్లా ఆయాగ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు.
సీఎం కేసీఆర్ సిద్దిపేట సభలో కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇటీవల వచ్చిన గులాబీ జెండాలే పాటను సింగర్ లక్ష్మమ్మ పాడడంతో సభా ప్రాంగణం మొత్తం నృత్యాలు చేశారు. ఇదే పాటను సిద్దిపేట అభివృద్ధికి అనువయించి పాడగా మంత్రి హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఆడిపాడారు. కనకవ్వ సిద్దిపేట అభివృద్ధిని వివరిస్తూ పాడిన పాటకు ప్రజలు చిందులేశారు. మిట్టపల్లి సురేందర్ జానపద కళాకారిణి కనకవ్వ, మధుప్రియ బృందం తమ ఆటపాటలతో సభికులను అలరించారు. గులాబీ జెండాలే రామక్క సభా మొత్తానికి హైలెట్గా నిలిచింది. లక్ష్మమ్మ పాట పాడింది నేనైన… పాటకు ప్రాణం పోసిన టీన్యూస్కు, నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభను హుషారెత్తించింది. కనకవ్వ పాటతో సభలో మరింత జోష్ పెరిగింది. సిద్దిపేటకు కోల్.. హరీశ్రావు రైలే తెచ్చిండు కోల్.. అంటూ సాగిన పాట ప్రజలను ఉత్సాహపర్చింది.