ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. వయస్సుతో సంబంధం లేకుండా దృష్టి లోపంతో బాధపడుతున్న వారందరికీ తిరిగి చూపు దక్కేలా ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు, అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో భాగంగా మెదక్ జిల్లాలో 20 పీహెచ్సీల పరిధిలో 20 బృందాలతో 4,39,316 మందికి టెస్ట్లు చేశారు. 61,695 మందికి కండ్లద్దాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో 10,16,877 మందికి పరీక్షలు చేయగా, 1,18,526 మందికి అద్దాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన సాయంతో సరికొత్త ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఖమ్మంలో సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు2’ను ప్రారంభించనున్నారు. మరుసటి రోజు(19న) జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు.
మెదక్/ సంగారెడ్డి, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆగస్టు 15, 2018న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రారంభించగా, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరులో హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కంటి వెలుగు పథకం తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కండ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, మందులను అందజేసింది. ఈ కార్యక్రమం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏడున్నర నెలల పాటు కొనసాగింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
మెదక్ జిల్లాలో 20 పీహెచ్సీలు.. 20 బృందాలు..
మెదక్ జిల్లాలో మొదటి విడతలో ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమంలో 4,39,316 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 63,375 (రీడింగ్ గ్లాస్) కండ్లద్దాల కోసం ప్రతిపాదనలు పంపగా, 61,695 కండ్లద్దాలను పంపిణీ చేశారు. దృష్టిలోపం ఉన్న వారిలో 35,158 మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. జిల్లాలోని 372 గ్రామ పంచాయతీలు, జిల్లా కేంద్రంలో ఉన్న నాలుగు వార్డుల్లో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. జిల్లాలోని 20 పీహెచ్సీల్లో 20 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఒక్కో టీం 151 మందికి పరీక్షలు చేశారు. కంటి చూపు లోపంతో బాధపడుతున్న వారికి కంటి పరీక్షలు చేసి, కండ్ల అద్దాలను, చికిత్స అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. శిబిరంలో ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం ప్రజలకు సేవలందించింది. ఒక్కో క్యాంపులోని వైద్య బృందం రోజుకొకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లాలో 10,16,877 మందికి పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏడు నెలల్లో 4224 కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. మొత్తం 336 మంది వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని కంటి పరీక్షలు చేశారు. జిల్లాలో మొత్తం 10,16,877 మందికి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు గుర్తించిన 1,18,526 మందికి ప్రభుత్వం ఉచితంగా అద్దాలు అందజేసింది. 48,120 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించి, ఉచితంగా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కంటివెలుగు కార్యక్రమం ద్వారా వెలుగులు పొందిన వారంతా ప్రస్తుతం ప్రభుత్వం మరోమారు కంటివెలుగు కార్యక్రమం ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 18 లక్షల మందికి కంటివెలుగు శిబిరాల ద్వారా పరీక్షలు నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పీహెచ్సీ యూనిట్గా..
కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టి లోపంతో బాధపడుతున్న జిల్లా ప్రజలకు వయస్సుతో సంబంధం లేకుండా విప్లవాత్మకమైన కంటి వెలుగు పథకం ద్వారా ఉచితంగా వైద్య పరీక్ష, శస్త్ర చిక్సిత, కండ్లజోడులు అందించింది. అవసరమైన వారికి మందులను సైతం ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. కంటిని కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్గా తీసుకొని గ్రామాల్లో, వార్డును యూనిట్గా తీసుకొని పట్టణాల్లో కంటి వెలుగు క్యాంపులను నిర్వహించింది. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు నాణ్యమైన కంటి అద్దాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఏడున్నర నెలల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఫస్ట్ ఫేజ్ కంటి వెలుగును విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండ లం మల్కాపూర్లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం మెదక్ జిల్లాలో ఏడున్నర నెలలు కొనసాగింది. జిల్లాలో 20 పీహెచ్సీల్లో 20 బృందాలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కండ్ల అద్దాలను పంపిణీ చేశాం.
– డాక్టర్ చందునాయక్, డీఎంహెచ్వో మెదక్
చారిత్రాత్మకం..
సీఎంకేసీఆర్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ‘కంటివెలుగు’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు పంచారు. కంటిచూపుతో ఇబ్బంది పడేవారికి పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిjw కంటి పరీక్షలు చేయించిన ఘనత సీఎం కేసీఆర్ సార్కే దక్కింది. రెండో సారి కూడా కంటి వెలుగు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నేను గతంలో పరీక్షలు చేయించుకుంటే అద్దాలు ఇచ్చిర్రు. వాటిని వాడుతున్నప్పటి నుంచి కండ్లు బాగా కనిపిస్తున్నాయి. కంటి వెలుగుతో కొత్తప్రపంచాన్ని చూస్తున్నా.
-నంద్యాల విష్ణువర్ధన్రెడ్డి,రైతు, గుమ్మడిదల
సీఎం కేసీఆర్ దయ
ప్రమాదవశాత్తు చిన్న రాయి ఎగిరిపడి, నా ఎడమ కనుగుడ్డును తాకడంతో కంట్లో పువ్వు వచ్చింది. అప్పటి నుంచా మసక మసకగా కనిపిస్తుండేది. ఏదైనా వస్తువును స్పష్టంగా చూడాలంటే, దెబ్బతిన్న కన్నును మూసి ఇంకో కన్నుతో చూడాల్సి వచ్చేది. లేకపోతే ఒకే వస్తువు రెండుగా కనిపించేది. చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ జన్మలో చూపు రాదనుకున్నా. అదే సమయంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘కంటి వెలుగు’లో పరీక్షలు చేయించుకుంటే నా ఎడమ కంటికి ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కావడంతో నాకు మునుపటిలాగే చూపు వచ్చేసింది. మా ఇంట్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
– వడ్డె లక్ష్మి, మల్కాపూర్, తూప్రాన్
కంటి వెలుగుతో ఎంతో మందికి మేలు..
ప్రభుత్వం నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమంతో ఎంతో మంది వృద్ధులకు మేలు జరుగుతుంది. కండ్ల సమస్యలు ఉన్నోళ్లకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి కండ్ల అద్దాలు ఇవ్వడం సంతోషం. సీఎం కేసీఆర్ చేపట్టే ప్రతి కార్యక్రమం బాగుంది. తెల్లాపూర్లో పెట్టిన కంటి వెలుగు కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా. ఇప్పుడు మళ్లీ కంటి వెలుగు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మరోపారి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సీఎం కేసీఆర్కు ప్రజల ఆశీర్వాదం తప్పకుండా ఉంటది.
– లలితమ్మ, తెల్లాపూర్,రామచంద్రాపురం
‘కంటి వెలుగు’తోనే బయటకు వచ్చిన..
కొన్ని ఏండ్ల ముందు నుంచే నా కంటి చూపు మందగించింది. నేను ఏ పనికి వెళ్లాలన్నా చూపుతో ఇబ్బందులు పడేవాన్ని. కంటి పరీక్షలు చేస్తున్నారని ఊర్ల చాటించగా, వెళ్లి చూపించుకున్నా. ఆపరేషన్ చెయ్యాలె. హైదరాబాద్ రమ్మన్నారు. బస్సు పంపించారు. మొదట కొంత భయం అనిపించింది. కానీ ఆపరేషన్ అయిన తర్వాత నాకు చూపు బాగా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. కంటి వెలుగుతోనే ఇప్పుడు బయట తిరుగుతున్న.
– జింక ముత్తయ్య, మల్కాపూర్
అందరికీ ఇలాగే కనిపిస్తుందనుకున్నా..
నాకు దూరంలో ఉండే ప్రదేశాలు, వ్యక్తులు, వస్తువులు మసకగాగా కనిపించేవి. అందరికీ అలాగే కనిపిస్తాయనుకేవాన్ని. సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభిచడంతో మామూలుగా టెస్ట్ చేయించుకున్నా. పరీక్షలో నాకు. 0.5 సైట్ అని తేలింది. అప్పుడు వారు నాకు ఉచితంగా కండ్లద్దాలను ఇచ్చారు. ఇప్పుడు చాలా బాగుంది.
– పాప శ్రీనివాస్, మల్కాపూర్
కండ్లద్దాలతోనే స్పష్టమైన చూపు..
గతంలో దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనపడేవి కావు. దీంతో ఇబ్బందికి గురయ్యే వాడిని. కంటి పరీక్షలు నిర్వహిస్తారని, చేయించుకోవాలని ఆలోచనే రాలేదు. ఓ రోజు మా ఊర్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిసి వెళ్లా. డాక్టర్లు కంటి చూపును పరీక్షించారు. వారం రోజుల్లో కండ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు దగ్గరి చూపు, దూరం చూపు రెండూ చాలా బాగా కనిపిస్తున్నాయి.
– వడ్డె ఎల్లయ్య, మల్కాపూర్