జిన్నారం, ఏప్రిల్ 10: ప్రతి సంవత్సరం రసాయన పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు, యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం డివిజన్ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో రెండు వందలకు పైగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో లక్ష వరకు కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఎండాకాలంలో రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేండ్లుగా 20వరకు రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయి. షార్ట్స్ సర్క్యూట్తో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాకాలంలో ప్రమాదాల సమస్య ఎక్కువగా ఉండటంతో ఏ సమయంలో ఎలాంటి విపత్తు జరుగుతుందోనని కార్మికులు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యాలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించటం లేదు.
నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మరో రెండు నెలలపాటు ఎండలు తీవ్రంగా ఉండనుండటంతో ప్రమాదాల నివారణపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులు, పారిశ్రామికవాడల ప్రజలు కోరుతున్నారు.