సిద్దిపేట టౌన్, జనవరి 5 : మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన హైస్కూల్ ఎదురుగా బట్టల, పండ్ల దుకాణాల్లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించడంతో ప్రాణ నష్టం తప్పింది. బాధితుల వివరాల ప్రకారం.. మెదకు రోడ్ హైస్కూల్ ఎదురుగా కొంతకాలంగా పండ్ల, వస్తువుల దుకాణాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. రోజు మాదిరిగా దుకాణాలు ముసివేశారు. బట్టల దుకాణం నిర్వాహకులు మహారాష్ట్రకు చెం దినవారు కావడంతో అందులోనే నిద్రిస్తున్నారు. తెల్లవారుజాము సుమారు 3 గంటల ప్రాంతంలో దుకాణాల వెనుక వైపు నుంచి మంటలు చెలరేగాయి. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ప్రమాదాన్ని గమనించి దుకాణాల్లో నిద్రిస్తున్న వారిని రక్షించారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
ఉపాధిని కోల్పోయాం
అనుకోని అగ్నిప్రమాదం తమ కుటుంబాల్లో చీకటిని నింపిందని బాధిత కుటుంబీకులు కన్నీటిపర్వతమయ్యారు. కొంతకాలంగా చిరువ్యాపారం ఏర్పాటు చేసుకొని తమ కాళ్లపై నిలబడి ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నామని, ఈ ఘటనతో తాము రోడ్డున పడ్డామన్నారు.ప్రమాదంలో రూ. 12 లక్షల విలువైన బట్టలు, పండ్లు మం టల్లో కాలిపోయాయని రోదించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
బాధితులను పరామర్శించిన మున్సిపల్ మాజీ చైర్మన్
తెల్లవారుజామున బట్టల, పండ్ల దుకాణాల సముదాయాల్లో జరిగిన అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, 42 వార్డు కౌన్సిలర్ కాటం శోభ రఘు రాం ఘటనా స్థలానికి చెరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కడవేర్గు రాజనర్సు మాట్లాడుతూ బాధితు కుటుంబాలకు అం డగా ఉంటామన్నారు. ప్రమాద ఘటనను మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తగిన సహాయం అందేలా చూస్తామన్నారు.