జిన్నారం, ఫిబ్రవరి 5: ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేకులే ఫార్మా లిమిటెడ్లోని నాల్గో బ్లాక్లో షార్ట్ సర్క్యూట్తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడే సాల్వెంట్ ఉండడంతో మంటలు అంటుకున్నట్లు సిబ్బంది, కార్మికులు తెలిపారు. పరిశ్రమ సిబ్బంది ఫైర్ సిస్టంతో మంటలు ఆర్పేందుకు యత్నించారు. అంతలోనే హెటిరో పరిశ్రమ ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అర్పింది. జీడిమెట్ల, పటాన్చెరు నుంచి ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పేందుకు వచ్చాయి.
మంటలు సాల్వెంట్ డ్రమ్ములకు అంటుకుని రెండు, మూడు పేలినట్లు ప్రత్యక్షంగా చూసిన కార్మికులు తెలిపారు. ఫైర్ ఇంజిన్తో వెంటనే మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో కేకులే పరిశ్రమ నుంచి నల్లని దట్టమైన పొగ వెలువడింది. దీంతో కార్మికులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సిబ్బంది తెలిపారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియాల్సి ఉందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. పరిశ్రమలోకి వెళ్లి ఏమేమి కాలిపోయాయో పరిశీలించాల్సి ఉంటుందన్నారు. బొల్లారం సీఐ సురేందర్రెడ్డి సిబ్బందితో వచ్చి పరిశ్రమను పరిశీలించారు. ఖాజీపల్లి సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, ఎంపీటీసీ భార్గవ్, నాయకులు పరిశ్రమను పరిశీలించారు.