సిద్దిపేట, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-24)ను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్న ఆశతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. సాగునీటి గోస తీరడంతో రైతులు ఖుషీఖుషీగా ఉన్నారు. సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యామా అని జిల్లాలో భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయి. కంటివెలుగు రెండో విడత కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం పక్కాగా అమలవుతున్నది. ఇక ఈ బడ్జెట్లో భారీగానే నిధుల కేటాయింపులు జరుగనున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే తొలి దశలో పూర్తిచేసిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించారు. ప్రస్తుత బడ్జెట్లో విద్య, వైద్యరంగానికి మరిన్ని నిధులు రానున్నాయని అందరూ భావిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తున్నది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం రెండు పంటలకు ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు ద్వారా అందిస్తున్నది. తాజాగా మొన్నటి యాసంగి సాగు పంట పెట్టుబడిని రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో వేసింది. రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా అర్హులైన వారికి లక్ష రుణమాఫీ చేస్తున్నది. ప్రస్తుత బడ్జెట్లో లక్ష వరకు రుణమాఫీకి బడ్జెట్ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
నీటి పారుదల రంగానికి పెద్దపీట..
నీటి పారుదల రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేయనున్నది. జిల్లాలో రిజర్వాయర్ల కింద ప్రధాన కాల్వలతో పాటు పిల్ల కాల్వలను పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ ఉండనున్నది. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలోనే వినియెగంలోకి తీసుకురానున్నారు.కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను పర్యాటకులు సందర్శించేలా మరి న్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. పేదలు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు నెలనెలా ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందిస్తున్నది. తాజాగా 57ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందిస్తున్నది.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆడపిల్ల పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా నూట పదహార్లు అందిస్తున్నది. కేసీఆర్ కిట్టు, నేతన్నకు చేయూత పథకం ఇలా అన్నివర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నది.జిల్లాలోని రహదారులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ విస్తరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తనవాటాగా కేటాయించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించి రైల్వేలైన్ను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఏడాది కాబట్టి ఇది సకల జనుల బడ్జెట్గా, ప్రజారంజకంగా ఉండే అవకాశం ఉన్నది.