మద్దూరు(ధూళిమిట్ట), మార్చి18: భూసర్వే చేయాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన గాజుల సరోజన అనే మహిళ రెండేండ్లుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ లో ఈనెల 10న ‘కాళ్లరిగేలా తిరిగినా కనికరించడం లేదు’ అనే శీర్షికతో కథనం ప్రచురించడంతో ఎట్టకేలకు సోమవారం మద్దూరు సర్వేయర్ స్పందించి సరోజన భూమిలో సర్వే నిర్వహించారు. సర్వేయర్ పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించకుండా కంటితుడుపుగా సర్వే నిర్వహించి, పూర్తి స్థాయి సర్వే కోసం ఆర్డీవోను సంప్రదించాలని ఉచిత సలహాలిచ్చి వెళ్లినట్లు సరోజన కుమారుడు మహేందర్ తెలిపారు.
తాము దరఖాస్తు చేసుకున్న ప్రకారం తమ భూమి చుట్టూ సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆయన కోరారు. తమ భూమి సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై సర్వేయర్ దుర్గాప్రసాద్ను వివరణ కోరగా.. ఒక్క సర్వే నెంబర్కు సంబంధించిన ‘టీపన్’ రికార్డులు అందుబాటులో లేవని, దీనికోసం డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని రైతుకు చెప్పినట్లు తెలిపారు.