సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 29 : నులిపురుగుల నివారణ మాత్రలు పకడ్బందీగా పంపిణీ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్యశాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 12న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1 నుంచి 19 ఏండ్లలోపు ఉన్న 4లక్షల5వేల207 మంది పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఆ రోజు మాత్రలు తీసుకోని వారికి మళ్లీ 19వ తేదీన అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ గాయత్రీదేవి, వైద్యాధికారులు డాక్టర్ శశాంక్, డాక్టర్ రాజేశ్వరి, విద్యా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.