గజ్వేల్, మార్చి 23: గజ్వేల్లో భూకబ్జాలు చేసిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికే చెందుతుందని, కబ్జాల బాగోతం అంతా ఆయనకే తెలుసని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. శనివారం గజ్వేల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నర్సారెడ్డి హయాం లో నల్లాల బావి, పద్మశాలి బట్టల మిల్లు, సింగాయిపల్లిలో కబ్జా చేసిన భూమిని కాఫీ కంపెనీకి అమ్ముకున్నాడని, రాజీవ్ రహదారి వెంబడి ఉన్న చెట్లను, లారీల కొద్ది యూరియాను అమ్ముకున్నాడని ఆరోపించాడు. నర్సారెడ్డి చరిత్ర ఏందో, ఎవరూ దళారీ వ్యవస్థను నడిపిస్తున్నరో ప్రజలకు తెలుసన్నారు.
2009లో టీడీపీ తరపున తాను ఎన్నికల్లో పోటీచేస్తే, పీఆర్పీ తరపున నిలబడిన ఎలక్షన్రెడ్డికి రూ.2కోట్లు ఇచ్చి ఓట్లు చీల్చి గెలిచాడన్నారు. 2014లో గజ్వేల్ నుంచి మరోసారి పోటీలో ఉంటే నాలుగు రోజుల ముందే ఫోన్ స్విచాఫ్ చేసుకుని కార్యకర్తలకు అందుబాటులోకి రాకుండా ఎక్కడికి పోయావని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ద్రోహం చేసింది నర్సారెడ్డే అన్నారు. 2018 తరువాత నాలుగున్నరేండ్ల పాటు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా ఎక్కడి పోయావని ప్రశ్నించారు. 2023లో కేసీఆర్పై పోటీచేస్తే కనీసం డిపాజిట్ రాలేదని, తన ముందు నిలబడే దమ్ము లేదని, తానంటే వెన్నులో వణుకు పుడుతుందని వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీ చైర్మన్ పదవులను ఎంతకు అమ్ముకుంటున్నావో పార్టీ కార్యకర్తలకు చెప్పాలన్నారు.
అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ పార్టీ పేరుతో మూడు నెలల కాలంలో ఎంత వసూలు చేశావో త్వరలోనే నీ చిట్టా ప్రజల ముందు బయటపెడుతానని పేర్కొన్నారు. మూడు సార్లు ఓడిపోయినా, ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారికోసం పనిచేస్తున్న వ్యక్తిని తానని, నీ చరిత్ర విధానం ఏందో ప్రజలకు తెలుసని, విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అనవసర ఆరోపణలు చేస్తూ మాట్లాడడం బాగాలేదన్నారు. తెలంగాణ రాష్టాన్ని సాధించిన ఉద్యమకారుడిపై పోటీచేసిన చరిత్ర తనదన్నారు. ప్రజల కోసం పార్టీలు మారాను తప్పా పదవుల కోసం కాదని వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్మీరా తదితరులు ఉన్నారు.