నిలువ నీడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సొంతింటి కల సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ కృషితో సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాకు మొత్తం 5920 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇందులో 5545 ఇండ్ల నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. వాటిలో 5047 ఇండ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 2653 సిద్ధమయ్యాయి. ఇందులో 1702 ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించారు. మరో 1496 ఇండ్లు ప్రారంభానికి సిద్ధ్దంగా ఉన్నాయి. నేడు జహీరాబాద్లోని రహమత్నగర్లో మంత్రి హరీశ్రావు సమక్షంలో 312 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తున్నది.
-సంగారెడ్డి, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ)
సంగారెడ్డి, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో పేదల సొంతింటి కల నెరవేరుతున్నది. పేదలకు సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతి ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే నిబంధనల మేరకు అర్హులకు అప్పగిస్తున్నారు. జహీరాబాద్లో మంగళవారం డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం కానున్నాయి. మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నారు.
జహీరాబాద్ పట్టణంలోని రహమత్నగర్లో 312 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. మంగళవారం ఉదయం మంత్రి సమక్షంలో 312 లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాకు మొత్తం 5920 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 5545 ఇండ్ల నిర్మాణం పనులకు టెండర్లు పూర్తయ్యాయి. టెండర్లు పూర్తయిన వాటిలో 5047 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 2653 నిర్మాణం పూర్తికాగా, 2394 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు 1702 ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించారు. 1496 ఇండ్లు ప్రారంభానికి సిద్ధ్దంగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఇండ్ల నిర్మాణం..
సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం 5920 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో అత్యధికంగా 3667 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 2253 నిర్మించనున్నారు. జిల్లాలో 5047 ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.