మహిళా సమాఖ్యలకు పెరగనున్న ఆదాయం
తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు
రైతులకు తగ్గనున్న ఖర్చులు
2020లో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలానికి అందజేత
వినియోగించుకున్న 253 మంది రైతులు.. రూ.1.80లక్షల ఆదాయం
గత నెల 17న కొండాపూర్, అందోల్ మండలాలకు అందించిన మంత్రులు
సంగారెడ్డి, మే 22 : మహిళా సంఘాల సభ్యులతో అద్దెకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో మహిళా సమాఖ్యలకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. మార్కెట్ అద్దెకన్నా తక్కువ ధరకే రైతులకు ఇచ్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ సదుపాయాలను అన్నదాతలు ఉపయోగించుకుంటే భారీగా సాగు ఖర్చులు తగ్గనున్నాయి. భూమిని నమ్ముకుని సేద్యం చేసే రైతు గుండె నిబ్బరం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముం దుకు వచ్చి మహిళా సంఘాలతో యాంత్రీకరణకు సదుపాయాలు ఏర్పాటు చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2020 నవంబర్లో జిల్లాలోని కోహీర్ మండలానికి వ్యవసాయ పనిముట్లతో కూడిన ట్రాక్టరును అందజేశారు.
ఏడాదిన్నర కాలంలో రైతులకు అద్దె ప్రతిపాదికన పనిముట్ల ఇవ్వడంతో 253మంది రైతులు ఉపయోగించుకున్నారు. దీంతో సమాఖ్యకు రూ. 1.80లక్షల ఆదా యం వచ్చిందని అధికారులు తెలిపారు. గత నెల 17న కొండాపూర్, అందోల్ మండలాల సమాఖ్యలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. కోహీర్ మండల సమాఖ్యకు పూర్తి సబ్సిడీతో రూ. 22లక్షల నిధులతో ట్రాక్టరుతో సహా వ్యవసాయ పనిముట్లను అందజేశారు. అలాగే ఇటీవల రెండు మండలాల సమాఖ్యలకు రూ. 32లక్షల విలువ గల యంత్రాలను మంత్రులు ఎర్రబెల్లి, హరీశ్రావు పంపిణీ చేశారు.
నారాయణఖేడ్లో ఏర్పాటుకు చర్యలు..
నారాయణఖేడ్ సమాఖ్యకు అందజేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు జిల్లాలోని అన్ని మండలల్లో మహిళా సమాఖ్యలకు పూర్తిస్థాయిలో ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిపాదనలు పంపారు. సెర్ప్ నుం చి ఆదేశాలు రాగానే ఆయా మండలాల సమాఖ్యలకు పనిముట్లు, ట్రాక్టర్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామ ని వెల్లడించారు. త్వరలో నారాయణఖేడ్ మండల సమాఖ్యకు ట్రాక్టర్తో పాటు వ్యవసాయ పనిముట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తునట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
మార్కెట్లో కంటే తక్కువ అద్దెకు పనిముట్లు
మహిళా సమాఖ్యలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇప్పటికే చిన్నచిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తూ అవసరం మేరకు బ్యాంకు రుణాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రైతుల సేద్యానికి ఉపయోగించే యంత్రాలను అద్దె ప్రతిపాదికన అందజేసి ఆర్థికంగా నిలబడేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరో ముందడుగు వేసింది. ట్రాక్టరు పనిముట్లకు గాను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) రూ. 16లక్షలను కేటాయించింది. యంత్రాలకు తీసుకున్న మొత్తాన్ని సమాఖ్యలు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే అవకాశాన్ని కల్పించారు. ఆయా కేంద్రాల ద్వారా ట్రాక్టర్లు, కల్టివేటర్, ఎంజి ప్లవ్, రొటేవేటర్, కేజ్వీల్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, జంబో, మినీ ప్లవ్, కల్టివేటర్ ప్లవ్, ఎన్టీపీ స్ప్రేయర్ తదితర పరికరాలను రైతులకు అద్దెకు ఇస్తారు. బయటి వారితో పోల్చితే సమాఖ్యలో లీటరుకు రూ.180చొప్పున అద్దెకు ఇస్తారు. అదే విధంగా మార్కెట్లో లీటరుకు రూ. 220లకు అద్దె చెల్లించి అన్నదాతలు నష్టాల్లో కూరుకుపోతున్నారు. సమాఖ్యలో అద్దెకు తీసుకుంటే రైతులకు రూ. 40లు మిగులుతున్నది. దీంతో మండల సమాఖ్యలకు ఆదాయం సమకూరడంతో పాటు అన్నదాతలకు సేద్యం ఖర్చు తగ్గుతుంది.
రైతులకు తగ్గనున్న వ్యవసాయ ఖర్చులు
మహిళా సమాఖ్యలతో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి సేద్యానికి వినియోగించే యంత్రాలను అద్దెకు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిం చాం. ఇప్పటికే ఏడాదిన్నరగా కోహీర్ మండలంలో రైతులకు తక్కువ అద్దెలతో ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లను ఇస్తున్నాం. గత నెల 17న జిల్లా పరిషత్ ఆవరణలో మరో రెండు మండలాలకు రెండు ట్రాక్టర్లు, పనిముట్లను పంపిణీ చేశాం. త్వరలో నారాయణఖేడ్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా జిల్లాలోని అన్ని మండల సమాఖ్యలకు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, పని ముట్లను అందచేసేందుకు చర్యలు చేపట్టాం. రైతు సేవా కేంద్రాలతో రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. వానకాలం, యాసంగిలో పంటలు వేసే రైతులు దుక్కులు సిద్ధం చేసేందుకు వ్యవసాయ పనిముట్లని అద్ద్దె కు తీసుకుని వినియోగించుకుని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలి.
– సూర్యారావు, అదనపు డీఆర్డీవో