నర్సాపూర్, మార్చి 28: పంటలకు నీరందక నేలలు నెర్రెలుబారి కండ్ల ఎదుటే ఎండిపోతుంటే రైతుల ఆక్రందనలు వర్ణనాతీతంగా మారాయి. పదేండ్లలో పచ్చని పంటలతో చిరునవ్వులు చిందించిన రైతన్న కండ్లల్లో కన్నీళ్లు ఆపడం ఎవరితరం కావడం లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన యువరైతు అయ్యవారి ధనుంజయ్ వరి చేను నీళ్లులేక ఎండిపోవడంతో గుండెలు బాదుకుంటున్నాడు.
తనకున్న 6 ఎకరాల 20 గుంటల పొలంలో రూ.లక్ష పది వేల పెట్టుబడితో వరి నాటాడు. పొలంలో మూడు బోర్లు ఉన్నప్పటికీ భూగర్భజలాలు ఎన్నడూలేని విధంగా ఈసారి అడుగంటిపోవడంతో బోర్లు నీరు పోయడం ఆపేశాయి. దీంతో రైతు ధనుంజయ్ చేసేదేమి లేక ఎండిపోతున్న వరి పంటను దిగాలుగా చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎండిపోయిన వరి పంటలో గేదెలను మేపాడు. ప్రభుత్వం స్పందించి ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.