సంగారెడ్డి కలెక్టరేట్, మే 23: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు పంటల బీమా పథకం ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకుడు గోపి తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, ప్రణాళిక శాఖ అధికారులు,అభ్యుదయ రైతులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు‘ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పంట బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వానకాలం 2024 నుంచి పీఏంఎఫ్బీవై స్కీంలో చేరాలని నిర్ణయించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా పథకం రైతులకు అందాలంటే రైతు ఏ పంట పండిస్తున్నాడనే వివరాలు పక్కాగా నమోదై ఉండాలని స్పష్టం చేశారు.ఈ బీమా ప్రయోజనాల గురించి గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏఈవోల సమన్వయంతో వ్యవహరించి ఈ బీమా ప్రయోజనాలు రైతులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఉచితంగా ఈ బీమా వర్తిస్తుందని, రైతుల ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు నర్సింహరావు, శివప్రసాద్, గోవింద్, సీపీవోలు బలశౌరి, చంద్రశేఖర్ రాజు, మాన్య, ఉద్యాన శాఖ అధికారు లు సోమేశ్వర్రావు, నర్సయ్య, ఆదర్శ రైతు లు, సిబ్బంది పాల్గొన్నారు.