రామాయంపేట, జనవరి 23: రామాయంపేట, చేగుంట మండలాల శివారు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట అటవీశాఖ అధికారి విద్యాసాగర్, డిప్యూటీ అధికారి నాగరాణి పేర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చేగుంట మండలం ఇబ్రహీంపూర్, కిష్టాపూర్, చిట్టోజిపల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం, రామాయంపేట మండలం డి.ధర్మారం, శవ్వాయపల్లె గ్రామాల పరిధిలో చిరుత సంచరించినట్లు రైతులు తెలిపారన్నారు.
రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, రాత్రి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లొద్దని, వెళ్లాల్సి వస్తే వెంట కర్రలు తీసుకుని వెళ్లాలన్నారు. సిబ్బందితో నిఘా పెట్టామని, చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.