హుస్నాబాద్, ఏప్రిల్ 26: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలన్నర దాటినా పొద్దుతిరుగుడు, మక్కల కొనుగోళ్లు పూర్తి కాలేదు. మార్చి 17న మక్కల కొనుగోళ్లు, మార్చి 21న సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సకాలంలో కొనకపోవడంతో ఎక్కడ పోసిన పంటకుప్పలు అక్కడే ఉండిపోయాయి. సన్ఫ్లవర్ కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశారు.
ఇప్పటి వరకు కేవలం 52మంది రైతులకు చెందిన 547 క్వింటాల్ల పొద్దుతిరుగుడు మాత్రమే కొన్నారు. అనంతరం కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్యార్డులోనే కుప్పలు దర్శనమిస్తున్నాయి. స్థలాభావంతో వడ్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నిటికంటే ముందు ప్రారంభించిన మక్కల కొనుగోళ్లు సజావుగా జరగలేదు. ఇప్పటి వరకు 613 మంది రైతులకు చెందిన 24,257 క్వింటాళ్ల మక్కలు కొన్నారు. ఇంకా రెట్టింపు స్థాయిలో మార్కెట్లో ఉన్నాయి. ఈ రెండు పంటలకే స్థలం పోగా, వరి రైతులకు స్థలం దొరకడం లేక్క ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని కోరుతున్నారు.
హుస్నాబాద్ మార్కెట్ యార్డుకు వడ్లు విక్రయానికి తెచ్చిన రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. యార్డుకు వడ్లు తెచ్చి ఏ మూలకో పోసుకుంటే, తమ వంతుకు వచ్చే వరకు పది రోజులు పడుతున్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15న ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అధికారులు, 20వ తేదీ నుంచి కాంటాలు పెట్టడం ప్రారంభించారు. దాదాపు వారం రోజులు జాప్యం చేయడంతో మార్కెట్లో వడ్ల నిల్వలు పెరిగిపోయాయి.
ఇప్పటి వరకు కేవలం 120మంది రైతులకు చెందిన 9,046 క్వింటాళ్ల వడ్లు మాత్రమే కొన్నారు. ఇంకా మార్కెట్లో కనీసం 30వేల క్వింటాళ్ల వడ్లు ఉన్నాయి. తేమ శాతం వచ్చినా కాంటాలు పెట్టడం లేదని రైతుల వాపోతున్నారు. ఇంతటి ఎండలో వడ్లు వెంటనే ఎండినప్పటికీ కాంటాలు, హమాలీల కొరతతో సకాలంలో కొనలేకపోతున్నారు. ఆకాశం మేఘావృతమైతే వడ్లను కుప్పపోయడం, అనంతరం మళ్లీ ఆరబోసుకోవడం…ఇదే దినచర్యగా మారిందని, వెంటవెంట వడ్లు కొనాలని రైతులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మార్కెట్ల వడ్లు పోసుకునేటందుకు జాగా లేదు. నేను తెచ్చిన వడ్లు కుప్పపోసి ఉంచిన. ఆరబోసుకునేందుకు జాగ లేక అట్లనే ఉంచిన. మూడు రోజులైతంది. నాపక్కన ఉన్న రైతు వడ్లు పోతే నా వడ్లను ఆరబోసుకుంట. మక్కలు, పొద్దుతిరుగుడు పంటలు కూడా పోస్తున్నందున వాటికి స్థలం పోతంది. ఉన్న జాగ మొత్తం వడ్లు పోసుకునేటట్లు చేసి తొందరగ వడ్లు కొంటే మేం ఇక్కడి నుంచి వెళ్లిపోతం. వానపడుతదని భయమైతాంది. వానపడితే వడ్లన్నీ కొట్టుకపోతయ్. అధికారులు వెంటవెంటనే కొనాలె.
– వంగ జనార్దన్రెడ్డి, రైతు,పోతారం(ఎస్), హుస్నాబాద్ మండలం (సిద్దిపేట జిల్లా)