కూలీల కొరత, పెట్టుబడి తగ్గించడంపై అన్నదాతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే డ్రమ్ సీడర్ విధానంతో వరి విత్తు పద్ధతిని అమలు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న టెక్నాలజీతో రైతులు కూడా యంత్రీకరణ వ్యవసాయానికి ముందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న యంత్రలక్ష్మి పథకంతో అన్నదాతలు సబ్సిడీ యంత్రాలను కొనుగోలు చేసి వ్యవసాయానికి వినియోగిస్తూ సులువైన పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు.
చేగుంట, డిసెంబర్ 27: డ్రమ్ సీడ్ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. చేగుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఆధునిక డ్రమ్ సీడర్ పద్ధతితో వరి నాట్లు వేస్తున్నారు. సాధారణంగా ఎకరం పొలంలో వరి నాట్లు వేయాలంటే 25 కిలోల విత్తనాలు నారు పోయాల్సి ఉంటుంది. నాట్ల కోసం పది మంది కూలీల వరకు అవసం ఉంటుంది. కానీ, డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా నారు పోయాల్సిన అవసరం లేదు. ఎకరం పొలానికి 8 నుంచి 10 కిలోల వరి విత్తనాలు మాత్రమే అవసరం అవుతాయి.
విత్తనాలు విత్తుకునే పద్ధతి
వరి విత్తనాలను ఒకరోజు నానబెట్టి మొలకలు రాకుండా చూసుకోవాలి. డ్రమ్స్ నుంచి విత్తనాలు బయటకు రావాలంటే మొలకలు రానివ్వకూడదు. సిద్ధం చేసిన మడులల్లో కూలీలు అవసరం లేకుండానే డ్రమ్ల్లో పోసేందుకు మోతాదు కోసం ఓ డబ్బాతో నాన బెట్టిన వరి విత్తనాలను పోసుకోవాలి. వరుస క్రమంలో డ్రమ్ను పొలంలో తిప్పడం ద్వారా డ్రమ్కు ఉన్న రంధ్రాల ద్వారా వరుస క్రమంలో మొలుకలు పొలంలో పడుతాయి. వారం రోజుల వరకు వరి మొలకల బయటకు వస్తాయి. డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి పంటను సాగు చేయడంలో మొలకలు దూరంగా పెరగడంతో కలుపు తక్కువగా వస్తుంది. పంట కూడా 20 నుంచి 30 రోజుల ముందు రావడంతో పాటు, దిగుబడి కూడా 10 బస్తాల వరకు ఎక్కువ వస్తుంది.
చేగుంట మండలంలో కర్నాల్పల్లి, మక్కరాజిపేట్, చందాయిపేట్, పోతాన్పల్లి, ఇబ్రహీంపూర్, బోనాల్తో పాటు పలు గ్రామాల్లో డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తున్నారు. డ్రమ్ సీడర్ యంత్రం మార్కెట్లో సుమారు రూ.4 వేల వరకు దొరుకుతున్నాయి. ఒక్కసారి కూలీలు నాటు వేసే డబ్బులతో డ్రమ్ సీడ్ను కొనుగోలు చేసుకోవచ్చని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
మూడేండ్లుగా డ్రమ్ సీడర్ పద్ధతితో సాగు చేస్తున్న..
మూడేండ్లుగా డ్రమ్ సీడర్ పద్ధతో వరి సాగు చేస్తున్నా. నాటు సమయంలో కలీల కొరత అధికంగా ఉంటుంది. వ్యవసాయ అధికారులు డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా సాగు చేసుకోవాలని సూచించారు. మొదటి నేను డ్రమ్ సీడర్ పద్ధతికి ఇష్టపడలే. ఒక సంవత్సరం ఈ పద్ధతి ద్వారా వరి సాగు చేశాను. కూలీల కొరత తగ్గి, తక్కువ సమయంలో ఎక్కువ దిగబడి వచ్చింది. 15 నుంచి 20 వేల వరకు ఖర్చులు కూడా తగ్గింది.
– గూడ కొండల్రెడ్డి, రైతు, కర్నాల్పల్లి, చేగుంట మండలం
తక్కువ సమయం ఎక్కువ లాభాలు..
డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా వరి సాగు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతి ద్వారా ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనాలు, పంట కాలంలో 20 నుంచి 30 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకి మాములు కంటే డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా సాగు చేస్తే 10 బస్తాల ధాన్యం దిగుబడి ఎక్కువ వస్తుంది. కలుపు సమయంలో తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి. డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగుపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– హరి ప్రసాద్, మండల వ్యవసాయాధికారి, చేగుంట