చేర్యాల, ఫిబ్రవరి 24 : అకాల వర్షంతో పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు బంధు సమ న్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ డైరెక్టర్ అంకుగారి శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
బలమైన గాలు లు, భారీ వర్షంతో మొక్కజొన్న, వరి, కూరగాయపంటలు, మామిడి తోటలకు నష్టం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి నష్టపరిహారం అంచనా వేసి రైతులకు పరిహారం అందే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల చొప్పు న నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
కాంగ్రెస్ సర్కారు కేవలం మాటలకు పరిమితమైందని, గత సంవత్సరం కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. మున్సిపల్ బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, నాయకులు పచ్చిమడ్ల సిద్ధిరాములు, మంచాల కొండయ్య, బీరెడ్డి ఇన్నారెడ్డి, కాశెట్టి భాగయ్య, కామల్ల కమలాకర్, బండి సుదర్శన్ పాల్గొన్నారు.