రాయపోల్,మార్చి 11 : కొండపోచమ్మ సాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్ బస్టాండ్ వద్ద లింగారెడ్డిపల్లి,రాంసాగర్,అంకిరెడ్డిపల్లి, పెద్దఅరెపల్లి రైతులు రోడ్డు పై బైఠాయించారు. రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు నింపటానికి కాల్వల ఉన్నప్పటికీ నీళ్లు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని, రామాయంపేట కెనాల్ ద్వారా చెరువులు నింపి పంటలను కాపాడాలన్నారు. కొండపోచమ్మ ప్రాజ్టెక్టు ఉన్నా గ్రామాల చెరువుల్లోకి సాగునీళ్లు ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసినప్పటికీ చెరువుల్లో నీరులేక పొలాలు ఎండిపోయే దశకు వచ్చాయన్నారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఈ విషయం తెలుసుకున్న రాయపోల్ ఎస్సై మానస, పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి రైతులను సముదాయించారు. ఎస్సై మానస సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సాగు నీళ్లు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.