మెదక్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. శిబిరాల వద్దకు వస్తున్న వృద్ధులు, ప్రజలు, యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కంటి వెలుగు కార్యక్రమం గురువారంతో పది రోజులు పూర్తి చేసుకున్నది. ఇప్పటి వరకు 48,262 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 23,631 మంది కాగా, మహిళలు 24,631 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 7,625 మందికి కంటి అద్దాలను అందజేశారు. మరో 7,066 మందికి కంటి ఆపరేషన్ల కోసం రిఫర్ చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ తెలిపారు. జిల్లాలో గురువారం 40 బృందాలు కంటివెలుగు సేవల్లో పాల్గొనగా, 5,555 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,619 మంది పురుషులు కాగా, 2,936 మంది మహిళలు ఉన్నారు. 624 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, 636 మందికి కంటి ఆపరేషన్ల కోసం రిఫర్ చేశామన్నారు. ఉదయం 9 గంటల వరకల్లా వైద్యులు, సిబ్బంది కంటివెలుగు శిబిరాల వద్దకు చేరుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సేవలందిస్తున్నారు.
సంగారెడ్డి, జనవరి 2 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కంటివెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో గురువారం 69 వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్య శిబిరాల్లో 14,718 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 7,213 మంది పురుషులు, 7,505 మంది మహిళలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన 9899, మున్సిపాలిటీల్లోని 3567, జీహెచ్ఎంసీలోని 1252 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 828 మంది మహిళలు, 730 మంది పురుషులకు కళ్ల అద్దాలు వైద్యులు అందజేశారు. 1198 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను ఆర్డర్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో 760 మంది పురుషులు, 749 మంది మహిళలకు కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు. మొత్తం 1509 మందికి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.