హుస్నాబాద్, డిసెంబర్ 26: యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పు దినుసులు, వేరుశనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయంలో ఎరువులతోపాటు పురుగుల మందులను కూడా వాడాల్సి ఉంటుంది. పంట సాగు చేసినప్పటి నుంచి పెరిగే, కోత దశలో కూడా పురుగు, తెగుళ్లు సోకుతాయి. ఈ సమయంలో వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకొని మందులను వాడితేనే మంచి ఫలితాలు, దిగుబడులు వస్తుంది. కానీ, రైతులు ఎరువుల దుకాణాల యజమానులు, పక్క రైతుల సలహాలు తీసుకొని మాత్రమే ఎరువులు, పురుగులు మందులు వాడుతున్నారు. దీంతో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. తెగులు ఒకటైతే మరొక ఫెస్టిసైడ్ను వాడటం, మోతాదుకు మించి వాడటంతో దిగుబడుల్లో తేడాలు వస్తుంటాయి. ప్రతి సీజన్లో రైతులు ఇటువంటి పొరపాట్లు చేస్తూ పంటనష్టపోవడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా పురుగుల మందులు కొనుగోలు నుంచి వాటిని పంటలపై పిచికారీ చేసేంత వరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమున్నదని వ్యవసాయాధికారులు చెప్తున్నారు.
రైతులు తమ పంటపొలాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసేందుకు వివిధ రకాల స్ప్రేయర్లు వాడుతారు. ఇందులో పవర్, కంప్రెషర్ స్ప్రేయర్లు ఉంటాయి. పవర్ స్ప్రేయర్లు వాడకంలో మందు వినియోగం ఎక్కువ, నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. వీటి ద్వారా స్ప్రే చేస్తే పంటలోని ప్రతి భాగంపై మందు పడి పురుగులు, తెగుళ్లు తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. కంప్రెషర్ స్ప్రేయర్లతో పిచికారీ చేసినప్పుడు చిన్నచిన్న తుంపర్లుగా మాత్రమే పంటపై పడుతుంది. పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేస్తే పొగలాగా వ్యాపించి ప్రతిచోట పడుతుంది. రైతులు ఎక్కువగా పవర్స్ప్రేయర్లకే ప్రాధాన్యతనిస్తే మంచిది. అకేలా స్ప్రేయర్లు, చేతి పంపులు, కంప్రెషర్ పంపులతో ప్రయోచనం తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్రిమిసంహారక మందులను మోతాదుకు మించి వాడితే పంటకు నష్టం. అవసరమైనంత మేరకే వాడాలి. పురుగుల మందులను ఎంత తక్కువ వాడితే అంత మంచిది. వీటి వల్ల భూమిలోని సారం తగ్గిపోయి భవిష్యత్తులో పంటలు పండే అవకాశం ఉండకుండా పోతుంది. మందులు పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. పంటకు ఏ తెగులు వచ్చిందో నిర్ధారించుకొని అందుకు తగిన మందును ఎంపిక చేసుకొని మాత్రమే ఉపయోగించాలి. పురుగుల మందును కలిపేటప్పుడు కూడా కొలతను విధిగా పాటించాలి. అప్పుడే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి.
వాణిజ్య పంటలతోపాటు కూరగాయల పంటలకు ఎక్కువగా పురుగుల మందులను వాడుతారు. ముఖ్యంగా వరి, పత్తి, మిరప, వేరుశనగ, కంది, పొగాకు, బెండ, కాలీఫ్లవర్, క్యాబేజీ తదితర పంటలకు క్రిమిసంహారక మందుల అవసరం ఎక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులోనూ పురుగుల మందు అవసరం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూర పంటలపై మోతాదుకు మించి ఫెస్టిసైడ్స్ వాడితే ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు పాటించారు.
పురుగుల మందుల వాడకం మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పురుగుల మందుల ప్రభావానికి గురైన వాళ్లలో ప్రత్యుత్పత్తి, పెరుగుదలలో మార్పులు సంభవించడం, హైపర్ యాక్టివిటీ, శరీర భాగాల మధ్య సమన్వయ లోపం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం, వికారం, వాంతులు, విరేచనాలు, స్పృహ కోల్పోవడం లాంటివి జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ మందులు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పంటల సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ముఖ్యమైన విషయం. పంటలు ఏపుగా పెరిగే దశలో పంటకు మేలు చేసే కీటకాలు, పురుగులు కూడా ఉంటాయి. ఇందులో మిత్ర పురుగులు, బదనికలు లాంటివి ఉంటాయి. వీటికి అపాయం జరుగకుండా ఉండే క్రిమిసంహారక మందులను మాత్రమే ఉపయోగించాలి. పంటకు మేలు చేసే పురుగుల కంటే నష్ట పర్చే పురుగులు అధికమైనప్పుడు పంటకు నష్టం వాటిల్లుతుంది. నష్టపరిచే పురుగు రకం ఏంటీ, ఆ పురుగులను నాశనం చేసే ఫెస్టిసైడ్ ఏంటీ అనేది పూర్తిస్థాయిలో గుర్తించి వాడితేనే పంటకు మేలు జరుగుతుంది. తెగుళ్లకు సంబంధించిన మందులు పురుగులను చంపేందుకు పనికిరావు. పురుగుల మందులను కలిపిన వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేస్తే దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
పురుగుల మందులు కొనుగోలులో ఎక్కువగా దుకాణాదారుడి లేదా పక్క రైతుల సలహాలు పాటించడం మానేయాలి.
పంటకు ఆశించింది పురుగా లేదా తెగులా లేదా పోషకాహార లోపమా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకొని మాత్రమే పురుగుల మందును ఎంపిక చేసుకోవాలి. లేకుంటే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
పురుగుల మందును అనేక వ్యాపార సంస్థలు వేర్వేరు పేర్లతో తయారు చేసి విక్రయిస్తారు. సాధారణ పేర్లతో పాటు వ్యాపార నామాలు కూడా రైతులు తెలుసుకోవాల్సిన అవసరమున్నది.
పురుగు మందుల డబ్బాలపై త్రిభుజాకారంలో ఒక రంగు ఉంటుంది. ఎరుపు రంగు ఉంటే అత్యధిక విషపూరితమైది. పసుపు రంగు ఉంటే అధిక విషపూరితం. నీలం రంగులో ఉంటే మధ్యస్థ విషపూరితం. ఆకుపంచ్చ రంగు ఉంటే స్వల్ప విషపూరితమని తెలుసుకోవాలి.
రైతులు వ్యవసాయశాఖ నుంచి లైసెన్స్ పొందిన కంపెనీలు, దుకాణాల నుంచి మాత్రమే పురుగుల మందులు కొనుగోలు చేయాలి.
కొనుగోలు చేసిన ప్రతి పురుగుల మందుకు విధిగా బిల్లు తీసుకొని భద్రపరుచుకోవాలి.
పురుగుల మందు డబ్బాలపై గడువు తేదీని విధిగా చూడాలి. గడువు తీరిన మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదు.
డబ్బాలకు మూతలు సరిగ్గా ఉన్నాయా లేదా ముందుగానే చూసుకోవాలి. లీకేజీ ఉన్న డబ్బాల్లోని పురుగుల మందు నాణ్యతను కోల్పోయే ప్రమాదమున్నది.
ఆహార పదార్థాలను, పురుగుల మందులను ఒకేసారి కొనుగోలు చేయకూడదు. రెండింటినీ ఒక చోట నిల్వ ఉంచరాదు.
పురుగుల మందులు కొనుగోలు చేసి తరలించేటప్పుడు, నిల్వ ఉంచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిలో కాకుండా వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక స్థలంలోనే భద్రపరచాలి.
పురుగుల మందు ద్రావణాన్ని చేతితో కలుపకుండా కర్రతో/ గ్లౌజులు వేసుకొని మాత్రమే కలపాలి.
పురుగుల మందు డబ్బాపై ఉన్న టేబుల్లో వివరాలను పూర్తిగా చదవాలి. అందులో సూచించిన విధంగా మాత్రమే మోతాదు ప్రకారం పురుగు మందును, నీటిని కలిపి పంటలపై పిచికారీ చేయాలి.
రెండు, మూడు మందులను కలిపి వాడేటప్పుడు వాటి కలయిక జరుగుతుందా, లేక ఏమైనా అనర్థం జరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకున్నాకే వాడాల్సి ఉంటుంది.
మందును పిచికారీ చేసేటప్పుడు విధిగా మూతికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించాలి.
పిచికారీ చేసేటప్పుడు గంజి పెట్టిన దుస్తులు ధరించాలి. మందు అవశేషాలు దుస్తులపై పడినా ఆరోగ్యంపై ప్రభావం చూపదు.
పురుగుల మందులను చల్లని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే చల్లాలి. తీవ్రమైన ఎండలో గానీ వర్షంలో గానీ పిచికారీ చేయరాదు.
నిపుణులు సిఫార్సు చేసిన మోతాదులో మందు పరిమాణాన్ని సరిగ్గా కొలిచి నీటితో కలపాలి.
గడ్డి మందుతో పురుగుల మందు కలిసి స్ప్రే చేయరాదు.
మందు స్ప్రే చేసే సమయంలో ఆహార పదార్థాలు, పానీయాలు గానీ సేవించరాదు. మందు పిచికారీ పూర్తయ్యాక స్నానం చేసిన తరువాత మాత్రమే తినడం, సేవించడం చేయాలి.
ఏదైనా సమయంలో పురుగుల మందు వల్ల హాని జరిగినట్లు అనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యుడిని సంప్రదించాలి.
పురుగుల మందులను పిల్లలకు, పశువులకు దూరంగా ఉంచాలి. చిన్న పిల్లలచే పిచికారీ చేయించొద్దు.
మందు పిచికారీ చేశాక డబ్బాలను భూమిలో పాతిపెట్టాలి. చెరువులు, కుంటలు, బావుల్లో వేయవద్దు.