చేర్యాల/కొమురవెల్లి, అక్టోబర్ 27: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొమురవెల్లి మండలంలోని రసూలబాద్, అయినాపూర్, తపాస్పల్లి, పోసాన్పల్లి, గురువన్నపేట గ్రామాల్లో ఆప్కో రాష్ట్ర మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, ఎంపీపీ తలారీ కీర్తనకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, మండల అధ్యక్షుడు గీస భిక్షపతితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వచ్చిన పల్లాకు మహిళలు బతుకమ్మ, బోనాలు, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తీసుకువచ్చిన ధీరుడు సీఎం కేసీఆర్ చెప్పిందే చేస్తాడని, ఎన్నికల కోసం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునే సంస్కృతి బీఆర్ఎస్కు లేదన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తన కోసం నెల పాటు పని చేస్తే వచ్చే ఐదేండ్ల పాటు ప్రజల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను గడగడపకూ తీసుకెళ్లాలన్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రం సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల కృషితో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, దీంతో పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయన్నారు. అధికంగా వడ్లు పండుతున్న ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొమురవెల్లి మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం తనదని, బీఆర్ఎస్కు ఓట్లు వేయించే బాధ్యత మీదని స్పష్టం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో సర్పంచ్లు పచ్చిమడ్ల స్వామిగౌడ్, లకుడపోయిన పొచమ్మ, వాయినాల నిర్మలాపర్శరాములు, వైస్ ఎంపీపీ కాగిత రాజేందర్రెడ్డి, ఎంపీటీసీ బచ్చల సాయిమల్లు, ఉపసర్పంచ్ కొండా శ్రీధర్, ఏఎంసీ డైరెక్టర్ మెరుగు కృష్ణ, సీనియర్ నాయకులు పబ్బొజు విజేందర్, మెరుగు శ్రీనివాస్గౌడ్, వూడెం గోపాల్రెడ్డి, బూరుగు నారాయణగౌడ్, ముత్యం నర్సింహులు, గొల్లపల్లి కిష్టయ్య, సార్ల కిష్టయ్య, ఏర్పుల మహేశ్, వకులభరణం నర్సయ్యపంతులు, బుడిగె గురువయ్యగౌడ్, నాగమల్ల శ్రీనివాస్, నాగమల్ల సత్యం, పడిగన్నగారి మల్లేశం, జింకల పర్వతాలు, గదరాజు చందు, కోతి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా ఉందన్నారు. పెన్షన్ రాని మహిళలు బాధ పడాల్సిన పని లేకుండా సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.3వేలు ఇవ్వనున్నామని, రూ.400లకు గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసేందుకు 6 గ్యారెంటీలు ప్రకటించిందని, అసలు ఆ పార్టీకే గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే అక్కడి ప్రజలను మోసం చేసిందని, అక్కడి ప్రజలు తెలంగాణకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో, 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.