గజ్వేల్, ఫిబ్రవరి 26 : కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు మినహా ఏ ఒక్కటి అమలు కాలేదని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు రూ. 2500, రైతుబంధు రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు, మహిళలకు వడ్డీలేని రుణాలు వెంటనే అమలు చేయాలన్నారు. హైదరాబాద్ చుట్టూ నోటిఫై చేసిన భూములను రద్దు చేయాలనే డిమాండ్ కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు మహేశ్, నాగులు, మనోహర్ పాల్గొన్నారు.
తొగుట, ఫిబ్రవరి 26: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిపన విజయ సంకల్ప యాత్ర సోమవారం తొగుటకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేశ్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్, మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి విభూషణ్రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహులు, నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 26 : బీజేపీ చేపట్టిన విజయసంకల్ప యాత్ర సిద్దిపేట పట్టణానికి చేరింది. పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి పాల్గొన్నారు.