గుమ్మడిదల, మే 2: ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన 420 సర్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుమ్మడిదలలో నిర్వహించిన రోడ్ షోలో హరీశ్రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరయ్యారు. రోడ్షోకు జిన్నారం, గుమ్మడిదల మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఆరు గ్యారెంటీల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఆడబిడ్డలకు ప్రతినెల రూ.2500, నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి, 24 గంటల కరంట్, కౌలురైతులకు రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దేవుళ్లపై ఒట్లు వేస్తున్నదని ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరుతో మిగిలిన 5 గ్యారెంటీలను మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేయడమే కాకుండా పోటీలో ఉండనని కాంగ్రెస్ సర్కారుకు సవాలు విసిరారు. 5 నెలలు అయినా గ్యారెంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ బీఆర్ఎస్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. మోసాలు చేసి, మాయమాటలు చెప్పే కాంగ్రెస్కు ఎన్నికల్లో ఒక్కఓటు పడకుండా అన్ని ఓట్లు కారుగుర్తుకు వేసి వెంకట్రామిరెడ్డికి విజయాన్నందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను వేడుకున్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అందరికీ ఆసరాగా ఉండడానికి ట్రస్ట్ ఏర్పాటు చేసి సాయమందిస్తానని హామీనిచ్చారు.
కేసీఆర్ ప్రకటించిన వెంకట్రామిరెడ్డికి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ విజయానందించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రజలను కోరారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కులేదన్నారు. 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ ప్రవీణాభాస్కర్రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సంతోష్రెడ్డి, వెంకటేశం గౌడ్, జిన్నారం, గుమ్మడిదల మండలాల అధ్యక్షుడు రాజేశ్, హుస్సేన్, పలు గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.