గరుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి పన్నెండు రోజుల పాటు న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రంలో నిర్వహించనున్న ఉత్సవాలకు ప్రభుత్వం రూ.50లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పించింది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉత్తరాది నుంచి ప్రముఖ పీఠాధిపతులు, నాగసాధువులు, సంతులు వస్తుండడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లకు మరమ్మతులు చేసి రవాణా సౌకర్యం మెరుగుపర్చారు. జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల నుంచి రోజూ 16 బస్సులు నడుపనున్నారు. మంజీరా తీరంలో గజ ఈతగాళ్లు, వలంటీర్లను నియమించారు. పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండనున్నారు. కుంభమేళాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు పెద్దఎత్తునతరలిరానున్నారు.
– న్యాల్కల్, ఏప్రిల్ 23
నేటినుంచి గురుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళా మంజీరా పుష్కరాలకు వేళయ్యింది. నేటినుంచి మే 5వ వరకు జరిగే మంజీరా పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ గ్రామాల శివారులోని సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం వద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. పీఠాధిపతులు, నాగుసాధువులు, సంతులు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పటికే ఉత్తరాది నుంచి నాగసాధువులు, సంతులు పంచవటీ క్షేత్రానికి చేరుకున్నారు.
న్యాల్కల్, ఏప్రిల్ 23 : కుంభమేళాలో భాగంగా మంజీరా నదిలో పవిత్ర స్నానం ఆచరించడంతో మోక్షం లభిస్తుందని, వ్యాధులు దూరమవుతాయని, పాపల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు సర్వతీర్థాలు మంజీర నదిలో చేరుతాయని, ఆ సమయంలో శక్తిమంతులైన మహాపురుషులు, దేవతలు పక్షి రూపాలు ధరించి మంజీర నదిలో స్నానం చేస్తారని, అప్పుడు నదిలో స్నానం చేసినా, విశేషమైన హోమాలు చేసిన ఫలం లభిస్తుందని కాశీనాథ్బాబా తెలిపారు. ఈనెల 24, 25, 27, 30, మే 4, 5వ తేదీల్లో విశేష రోజులు ఉన్నాయని, పుణ్యస్నానాలు చేస్తే ఫలితం దక్కుతుందన్నారు. కుంభమేళాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
ఆలయం వద్ద భారీగా ఏర్పాట్లు..
ఈ కుంభమేళాలో పాల్గొనే నాగసాధువులు, సంతులు, భక్తుల కోసం పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు భక్తులకు అన్నదానం చేసేందుకు షెడ్లను సిద్ధం చేశారు. నదీతీరంలో ముళ్లపొదలు, చెత్తాచెదరం తొలిగింపుతో పాటు స్నాన ఘాట్లు, షవర్లు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. కుంభమేళాకు వచ్చే మండలంలోని ప్రధాన రోడ్డు మార్గాలకు మరమ్మతులు చేసి సిద్ధం చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం సంబంధిత అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేకంగా ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచారు. మంజీర నదీ తీరంలో పోలీసులు, గజ ఈతగాళ్లు, వలంటీర్లను నియమించారు. భక్తులకు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రత్యేక నల్లాలు బిగించి, ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. మంజీర నదితో పాటు పంచవటీ క్షేత్ర పరిసరాల్లో శానిటేషన్కు పారిశుధ్య సిబ్బందితో పాటు ట్రాక్టర్ల ద్వారా చెత్తాచెదారాన్ని తరలించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. వేలాది మంది భక్తులు తరలి రానుండడంతో జిల్లా ఎస్పీ రమణకుమార్, జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కమాండ్ కంట్రోల్ రూం, సీసీ కెమెరాలను బిగించి పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ ఆర్ఎం సుదర్శన్ ఆధ్వర్యంలో జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోలతో పాటు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆరోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, వైద్యాధికారులు, సిబ్బంది, అన్ని మందులు అందుబాటులో ఉంచింది.
మంజీరా కుంభమేళా రోజువారీ కార్యక్రమాలు…
ఈనెల 24వ తేదీన ఉదయం 9 గంటలకు ధ్వజారోహణం, 11 గంటలకు మంజీర నదిలో నాగసాథులు, సంతుల, భక్తుల పుణ్యస్నానాలు, అనంతరం భోనాల ఊరేగింపు, ఆనంతరం మహాత్ములు, నాగసాధులు, సంతులు, ప్రముఖుల ప్రసంగాలు, ప్రవచనాలు, 5 గంటల నుంచి హోమాలు, పూర్ణహుతి, అమృత స్నానం, గంగా మహాహారతి కార్యక్రమాలు ఉంటాయని కాశీనాథ్ బాబా తెలిపారు. 25వ తేది నుంచి మే 5వ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మంజీర నదిలో నాగసాథులు, సంతుల, భక్తుల పుణ్యస్నానాలు, అనంతరం బోనాల ఊరేగింపు, ఆనంతరం మహాత్ములు, నాగసాధులు, సంతులు, ఫ్రముఖుల ప్రసంగాలు, ప్రవచనాలు, 5 గంటల నుంచి హోమలు, పూర్ణహుతి, అమృత స్నానం, గంగా మహాహారతి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
హాజరుకానున్న పీఠాధిపతులు, ప్రముఖులు
కుంభమేళాను విజయవంతం చేయాలి
గురుడగంగ పూర్ణ మంజీరా కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. 12 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. పంచవటీ క్షేత్రంతో పాటు ప్రభుత్వ సహకారంతో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి నాగసాథులు, సంతులు, పీఠాధిపతులు, ప్రముఖులు హాజరై ప్రసంగాలు, ప్రవచనాలు బోధించనున్నారు.
– కాశీనాథ్బాబా, సిద్ధ సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం రాఘవాపూర్, న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా)