AADHAAR | సిద్దిపేట రూరల్ , మే 16 : నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆధార్ తప్పనిసరి అయింది. అయితే 2014 కంటే ముందు ఆధార్ పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందే. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్ 14 వరకు ప్రభుత్వం గడువు విధించింది. చిన్నారులకు కార్డు తీసుకుని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకులు, శాశ్వత ఆధార్ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి అప్డేట్ చేసుకోవాలి. పదేండ్ల కిందట ఆధార్ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్ధ(యూఐడీఏఐ) సూచిస్తోంది. 2009లో ఆధార్ నమోదు ప్రారంభం కాగా గ్రామాలు, పట్టణాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి వేలిముద్రలు, కనుపాపలు, ఫొటోలతో ప్రతి ఒక్కరికీ కార్డులను జారీ చేశారు.
ఏండ్లుగా ఆధార్లో కొన్ని మార్పులకు యూఐడీఏఐ అవకాశం కల్పించలేదు. అందులో ప్రధానంగా 2010-18 వరకు ఆధార్ నమోదు చేసుకున్న కార్డుదారులు బంధుత్వాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంది. తండ్రి(సన్నాఫ్), భర్త(వైఫ్ ఆఫ్) వంటి వాటిని ఇప్పుడు మార్చుకోవచ్చు. ప్రస్తుతం దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్గా కొనసాగిస్తున్నారు. ఆధార్ నవీకరణ బంధుత్వాల మార్పుతో పాటు ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ, ఫొటో, చిరునామా వంటివి అప్డేట్ చేసుకోవచ్చు. 2014కు ముందు కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆధార్ను నవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రజలు తమ పదో తరగతి, పాన్, ఓటర్ కార్డు, పాస్పోర్టుల్లో ఏదో ఒకటి జతపర్చాలి. ఇందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతి ముద్రలతో ఆధార్ కార్డు జారీ చేశారు. వారికి ఐదేండ్లు పూర్తయ్యాక వారి వేలిముద్రలు, ఫొటోలను అప్డేట్ చేసుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రంలోనూ అప్డేట్ చేయించుకోవాలి. ఈ క్రమంలో 70 ఏండ్లు దాటిన వారికి అప్డేట్ నుంచి మినహాయింపు కల్పించారు. ఎలాంటి రుసుం చెల్లించకుండా ఆన్లైన్లో ఆధార్ కార్డును స్వతహాగా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మై ఆధార్ పోర్టల్, ఎం-ఆధార్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మండలాల్లోని శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు.
డ్యాక్యుమెంట్లు అందించి అప్డేట్ చేసుకోవాలి
ఆధార్ పొంది పదేండ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ కార్డును అప్డేట్ చేసుకోవాలి. బ్యాంకులు, శాశ్వత ఆధార్ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి నవీకరణ చేసుకోవచ్చు. స్వతహాగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం ఉన్నది. ప్రతి వ్యవహారానికి ఆధార్ ప్రామాణికంగా మారింది. కావునా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూన్ 14 వరకు తప్పనిసరిగా ఆధార్కార్డు అప్డేట్ చేసుకోవాలి.
– శ్రీనివాస్, తాసీల్దార్, సిద్దిపేట రూరల్ మండలం