మెదక్, అక్టోబర్ 1 : మానసిక ఒత్తిడులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలపై రూపొందించిన కరపత్రాన్ని శుక్రవారం తన ఛాంబర్లో డీఆర్డీవో, పర్యాటక అధికారి శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాను పరిశీలిస్తే ప్రస్తుత మెదక్ జిల్లాలో పర్యాటకులను ఆకర్శించడానికి పలు ప్రదేశాలున్నాయన్నారు. వారాంత సెలవుల్లో ఆహ్లాదంగా గడపడానికి హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు నర్సాపూర్ అర్బన్ పార్కుకు వస్తున్నారని అన్నారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు మరో 40, 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏడుపాయల దుర్గభవానీ, మెదక్ చర్చ్, ఖిల్లా, పోచారం డ్యాం, అభయారణ్యం వంటివి సందర్శించేలా ఒక సర్క్యూట్ను రూపొందించుటకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగ అభివృద్ధి చెందడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
పర్యాటకులకు మానసిక ప్రశాంతత చేకూరడమే గాక విజ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చని, రాబోయే భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను టూరిజం ద్వారా తెలుపవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో భీమయ్య, డీపీఆర్వో శాంతికుమార్ పాల్గొన్నారు.