మెదక్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటరుగా నమోదు చేసేలా అన్ని స్థాయిల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సంబంధిత సిబ్బందితో (స్విఫ్ ఆక్టివిట్స్) ఓటరు నమోదు కార్యక్రమం తదితర అంశాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పోలింగ్ కేంద్రాల వివరాలు, అన్ని కళాశాలల్లో ఓటర్ నమోదుకు క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలన్నారు. అక్టోబర్ 1, 2023 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 21న సీనియర్ సిటిజన్ల దినోత్సవం సందర్భంగా జిల్లాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
మెదక్ జిల్లా ఓటరు నమోదుకు సంబంధించిన అంశంపై కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని కళాశాలల్లో ఓటర్ నమోదు పర్యవేక్షకులుగా ఏఈఆర్వోలను నియమించినట్లు తెలిపారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఓటర్ నమోదు, ఓటింగ్ శాతం పెంచడానికి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న 2కే రన్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, ఉద్యోగులు, విద్యార్థులు, యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఈ నెల 21న జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ ముసాయిదా జాబితాను ప్రదర్శన, ప్రచురణ ప్రతులను గ్రామ పంచాయతీ, పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుచున్నాయని తెలిపారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, డీఆర్ఓ పద్మశ్రీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.