మెదక్, (నమస్తే తెలంగాణ) / సంగారెడ్డి, డిసెంబర్ 8: లక్షలు, ఆరంకెల జీతాలున్నా చేయి తడపనిదే కొంత మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయడం లేదు. పని జరగాలంటే అంతో ఇంతో ముట్టజెబితే కానీ ఫైలు ముందుకు కదలడం లేదు. ఉన్నత ఉద్యోగం.. సమాజంలో గౌరవం.. నెల చివరి తేదీకి జీతం వచ్చినా అత్యాశకుపోతున్న కొంతమంది అధికారులు లంచాలు తీసుకుంటూ కటకటాలపాలవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం, బిల్లుల మంజూరు కోసం లంచాలు డిమాండ్ చేసే అధికారులు, సిబ్బందిపై కొరడా ఝులిపించడానికి మేమున్నామంటూ భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు ఏసీబీ అధికారులు. 2021-2022 సంవత్సరంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 కేసుల్లో అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులు పట్టుబడ్డారు. ప్రతి ఏడాది అవినీతిని అంతమొందించాలని అవినీతి నిరోధకశాఖ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడంతో ప్రజల్లో చైతన్యం పెరిగి పారదర్శకంగా పనులు చేయించుకుంటుండడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. గత యేడాదిలో అధికంగా భూ సర్వేశాఖలో పనిచేస్తున్న అధికారులు పట్టుబడ్డారు. రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే అధికారులు కూడా అవినీతి కేసుల్లో దొరికారు. లంచం అనే పదం వినబడకుండా చేయడం కోసం వారం రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో ప్రజలకు కరపత్రాలు, గోడలకు స్టిక్కర్లు అతికిస్తూ చైతన్యం కల్పిస్తున్నారు. డిసెంబర్ 9 ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఉమ్మడి జిల్లాలో ఏడేండ్లలో నమోదైన కేసులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా గత ఏడేండ్ల కాలంలో రెవెన్యూ శాఖలో 17 కేసులు, విద్యాశాఖ-3, పరిశ్రమల శాఖ-1,పంచాయతీ శాఖ-6, అటవీశాఖ-3, పశుసంవర్దకశాఖ-1, ఆరోగ్యశాఖ-6, ఫ్యాక్టరీస్-1, మున్సిపల్శాఖ-2, ఆర్టీఏ శాఖ-1, కోశాధికారిశాఖ-1, విద్యుత్శాఖ-2, సర్వేల్యాండ్శాఖ-1, న్యాయశాఖ-1 చొప్పున అవినీతి కేసులు నమోదైనట్లు అవినీతి నిరోధకశాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. 2015లో 16కేసులు, 2016-6, 2017-2, 2018-7, 2019-9, 2020-3, 2021-3 కేసులు నమోదు అయ్యాయి.
గత ఏడాదిలో 8 కేసులు
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో లంచం తీసుకున్న సిబ్బందిపై 8 కేసులు నమోదయ్యాయి. రెవెన్యూశాఖ-1, భూ సర్వే-2, కోశాధికార్యాలయం-1, చేనేత శాఖ-1, విద్యుత్ శాఖ-1, పురపాలకశాఖ-1, పంచాయతీరాజ్ శాఖ-1 కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
వారం రోజులు వారోత్సవాలు..
గతనెల 30 నుంచి అవినీతి నిరోధక వారోత్సవాలు ప్రారంభించి రోజువారీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టులు ఏర్పాటు చేశారు. రెండో రోజు వారం రోజులు చేపట్టబోయే వివరాలు మీడియాకు అందజేశారు. మూడో రోజు స్థానిక కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించి అవినీతిపై ప్రజలకు వివరించారు. నాల్గొవ రోజు అవినీతి నిరోధకశాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఐదో రోజు అవినీతిపై నమోదైన కేసులను పరిశీలించారు. ఆరో రోజు వీఐపీలతో కార్యక్రమాలు నిర్వహించి, ఏడో రోజు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించే కార్యక్రమం నిర్వహించారు. ఎనిమిదో రోజు ముగింపు సందర్భంగా కేసులు పరిశీలించి, వచ్చిన దరఖాస్తులను గుర్తించి కార్యాలయంలో నివేదికలు తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారోత్సవాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు ర్యాలీలు, సదస్సులు, చర్చాగోష్టిలు నిర్వహించకుండా కరపత్రాలు, గోడలకు స్టిక్కర్లు అంటిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.
లంచమడిగితే సమాచారమివ్వండి..
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రజలను లంచం అడిగితే అవినీతి నిరోధకశాఖ అధికారులకు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. లంచం అడిగినా నేరమే.. ఇచ్చినా నేరమే. తీసుకున్న వారిపై ఎలాంటి కేసు నమోదు అవుతుందో ఇచ్చిన వారికి కూడా అదే వర్తిస్తుంది. ఈ విషయం తెలుసుకుని అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇందు కోసం టోల్ఫ్రీ నెంబర్ 1064, డీఎస్పీ నంబర్ 94404 46149లో ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది కేసులు తగ్గాయి. ప్రభుత్వం పారదర్శకంగా పాలన ప్రజల దరి చేరుస్తుండడంతో అవగాహన పెరిగింది. – ఆనంద్ కుమార్, డీఎస్పీ, అవినీతి నిరోధకశాఖ
ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి. ఈ నంబర్ హైదరాబాద్ ఏసీబీ కార్యాలయంలో ఉంటుంది. అకడి నుంచి ఉమ్మడి జిల్లాల్లోని ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి లేదా కార్యాలయానికి సమాచారం అందుతుంది. నేరుగా డీఎస్పీ లేదా ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తారు. ఆరోపణలు నిజం అని తెలిస్తే ఫిర్యాదుదారుడి నుంచి ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకొని వాటికి కెమికల్ కలిపి ఇస్తారు. అవినీతి అధికారికి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడు సదరు అధికారి లేదా సిబ్బందికి నగదు ఇవ్వగానే రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొంటారు. ఫిర్యాదుదారుడి డబ్బులు ఒక రుపాయి మినహాయించకుండా కేసు నడుస్తుండగానే 30 లేదా 45 రోజుల్లో వాపసు ఇచ్చేస్తారు.