సంగారెడ్డి, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో నీలి విప్లవం సాకారం దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నది. మత్స్య సంపద అభివృద్ధితో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మత్స్యసంపద పెరుగుదల కోసం ప్రభు త్వం ఏటా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 2016-17 నుంచి చేపపిల్లల విడుదల ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు విడతలుగా 17.30 కోట్ల విలు వ చేసే చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. తాజాగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలోని 1071 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను మత్స్యశాఖ ద్వారా వదలనున్నారు. సంగారెడ్డి జిల్లాలో చేపల పెంపకానికి అనువుగా 1071 చెరువులు ఉన్నాయి. వీటిలో 942 చిన్న చెరువులు ఉండగా, 129 పెద్ద చెరువులు ఉన్నాయి. జిల్లాలోని 1071 చెరువుల పరిధిలో 219 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల్లో 10,789 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం మత్స్యకార సొసైటీలకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను ఉచితంగా అందజేస్తున్నది. మత్స్యశాఖ జిల్లాలోని మత్స్యకారుల సొసైటీలకు ఉచితంగా చేపలు అందజేస్తే, వారు చెరువుల్లో వదలుతున్నారు. ఉచితంగా చేప పిల్లలను వదలడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. చేపలు పెరిగిన తర్వాత మత్స్యకారులు వాటిని పట్టుకుని అమ్ముకుని ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.17.30 కోట్ల విలువ చేసే చేపిల్లలను వదలగా, 18,993 కోట్ల టన్ను ల చేపల దిగుబడి వచ్చింది.
362 లక్షల చేప పిల్లల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో మత్స్యశాఖ సంగారెడ్డి జిల్లాలోని 1071 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు పంపిణీకి సిద్ధమవుతున్నది. 1071 చెరువుల్లో 362 లక్షల చేప పిల్లలను నేడోరేపో వదలనున్నట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని 942 చిన్న చెరువుల్లో 217 లక్షల చేప పిల్లలు వదలనున్నారు. 217 లక్షల కట్ల, రోహు, బంగారుతీగ రకం చేప పిల్లలను మత్స్యకార సొసైటీల ఉచితంగా అందజేయనున్నారు. జిల్లాలోని 129 పెద్ద చెరువుల్లో 145 లక్షల చేప పిల్లల వదలనున్నారు. కట్ల, రోహు, మ్రిగాల రకం 145 లక్షల చేపలను మత్స్యశాఖ 129 చెరువుల్లో వదలనున్నది. సింగూరు ప్రాజెక్టులో 61 లక్షలు, నల్లవాగు ప్రాజెక్టులో 11.50 లక్షలు, సదాశివపేట మండలంలోని మెలిగిరిపేట ప్రాజెక్టులో 6 లక్షల చేపలు వదలనున్నారు. 40శాతం కట్ల, 50 శాతం రోహు, 10 శాతం మ్రిగాల రకం చేపలను ప్రాజెక్టుల్లో వేయనున్నారు. సింగూరు, నల్లవాగు, మెలిగిరిపేట ప్రాజెక్టులతోపాటు అందోలు, మల్కాపూర్, మల్చెల్మ, గొటిగార్పల్లి, కుసునూరు చెరువుల్లో 25 లక్షల రొయ్యలను ఉచితంగా వేయనున్నారు.
చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంగారెడ్డి ఉచితంగా చేప పిల్లలను పంపిణీకి ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని 1071 చెరువుల్లో 362 లక్షల చేపపిల్లలను ఈసారి వదిలేందుకు ప్రణాళికా సిద్ధం చేశాం. జిల్లాలోని చెరువుల్లో ఎక్కువగా కట్ల, రోహు, బంగారుతీగ, మ్రిగాల రకం చేప పిల్లలను వదులుతాం. ప్రాజెక్టుల్లో రొయ్యలు పెంపకం చేపట్టడానికి ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీలు, మత్స్యకారులు పాల్గొంటారు.
-సతీశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి సంగారెడ్డి