మెదక్ జిల్లాలో చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానికి పోటెత్తారు. ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు.
గ్రామాల్లో ఉన్న ఓటు హకును వినియోగించుకునేందుకు నగరాల్లోని ప్రజలు పల్లెబాట పట్టారు. ఉదయం 11 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అమాంతం పెరిగింది. రాత్రి 7 ఠగంటల వరకు మెదక్ నియోజకవర్గంలో 85.03 శాతం, నర్సాపూర్ నియోజకవర్గంలో 88.04 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తంగా జిల్లాలో 88.69 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. చెదురు మదురు ఘటనలు మినహా మొత్తం 2 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కాగా, ఈనెల 3న ఫలితాలు వెలువడనున్నాయి.