మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 2: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం స్వీప్ యాక్టివిటీ, ఓటరు నమోదు, ఓటరు కార్డుకు అనుసంధానం తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడ్చల్ నుంచి అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ 2004 జనవరి ఒకటి నుంచి 2004 డిసెంబర్ 31 వరకు జన్మించిన పిల్లల వివరాలను స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సేకరించి, వారిని నూతన ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లోని స్వయం సహాయ, మహిళా సంఘాలతో బూత్ లెవల్ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, నూతన ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. జిల్లాలోని ఆయా విద్యా సంస్థల్లో చదువుకుంటున్న 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించారు. ఓటరు ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఆధార్ అనుసంధానం చేయాలి: సంగారెడ్డి కలెక్టర్
అనంతరం కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఒటరు నమోదు, ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు చేశారు. ఓటరు నమోదు ఫారాలు అవసరమైనన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అందుకు చౌక ధరల దుకాణాల డీలర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. ఓటర్లకు గరుడా యాప్ పై అవగాహన కల్పించాలన్నారు. బీఎల్వోలు, బీఎల్వో సూపర్ వైజర్లు ప్రత్యేక దృష్టి సారించి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం విధిగా చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. వారంలోగా 75 శాతం ఆధార్ లింకేజీ పూర్తి చేయాలని కోరారు. స్వీప్ యాక్టివిటీ ముమ్మరం చేయాలని, స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఐసీడీఎస్ ఉపాధ్యాయులు, సూపర్వైజర్లు, డీఎల్పీవోలను భాగస్వాములను చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, ఆర్డీవోలు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: మెదక్ కలెక్టర్
కలెక్టర్ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ స్వశక్తి మహిళా సంఘాలతో సమావేశాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. ఈ నెల 4 నుంచి 9 వరకు సదరు సమావేశాలు, 5 నుంచి 9 వరకు సదరు సమావేశాలు ప్రారంభించాలని సూచించారు. 11 నుంచి 16 వరకు గర్భిణులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడంపై శ్రద్ధ వహించాలన్నారు. 19 నుంచి 24 వరకు జిల్లాలోని దవాఖానల్లో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. వ్యాపారులతో చర్చించి వారి సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఈడీఎం సందీప్, డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.