చేర్యాల, మే 26: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం ఉదయం 8 నుంచి 4గంటల వరకు పోలింగ్ జరగనున్నది. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల స్టేషనరీ ఆర్టీసీ బస్సుల్లో ఆదివారం చేరాయి. చేర్యాల సీఐ శ్రీను ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ఎస్సైల ఆధ్వర్యంలో సెక్టోరియల్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని చేర్చారు.చేర్యాల సబ్ డివిజన్ పరిధిలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒక్కో కేంద్రానికి మైక్రో అబ్జర్వర్, సెక్టోరియల్ అధికారితో పాటు పీవో, ఏపీవో, ఓపీవోలు, పోలీస్ సిబ్బందిని కేటాయించారు. చేర్యాల పోలింగ్ కేంద్రం(1)లో 1258, పోలింగ్ కేంద్రం(2)లో 1297, కొమురవెల్లి పోలింగ్ కేంద్రంలో 680, మద్దూరు పోలింగ్ కేంద్రంలో 936, ధూళిమిట్ట పోలింగ్ కేంద్రం లో 511 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చేర్యాల, కొమురవెల్లి పోలింగ్ కేంద్రాలకు చేర్యాల ఎంపీడీవో మహబూబ్అలీ, మద్దూరు, ధూళిమిట్ట పోలింగ్ కేంద్రాలకు ఎంపీడీవో రామ్మోహన్ సెక్టోరియల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా సహకరించాలని సీఐ శ్రీను, ఎస్సై దామోదర్ కోరారు.