జహీరాబాద్, జనవరి 6: ‘మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మీరంతా బీఆర్ఎస్పార్టీని ఆశీర్వదించాలి.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శుక్రవారం ఝరాసంగం మండలంలోని బిడెకన్నె గ్రామ శివారులో ఉన్న అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మహిళ రైతులతో మాట్లాడారు. మహిళల కోసం పప్పుమిల్లు ఏర్పాటు, కుసుమ నూనె తయారు చేసేలా కృషి చేస్తామన్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి కరెంట్ సౌకర్యం కల్పించి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసేందుకు చెక్డ్యాంలు, ఊట చెరువులు నిర్మిస్తామని, కాళేశ్వరం నీటితో వ్యవసాయ భూములకు నీటిని అందిస్తామని తెలిపారు. సేంద్రియ పంటలు పండిస్తే మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మా భూములకు పట్టాపాసు పుస్తకాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సారు అని మహిళా రైతులు తెలిపారు. ఎరువులు, విత్తనాలు విక్రయించేందుకు లైసెన్స్ మంజూరు చేస్తామన్నారు.
బిడెకన్నె మహిళా రైతులతో మంత్రి ముఖాముఖి..
మంత్రి హరీశ్రావు: మీ సంఘంలో ఎంత మంది మహిళలు ఉన్నారు..
మహిళా రైతులు: మా సంఘంలో సమ్మమ్మ, తుల్జమ్మ, మాణిక్యమ్మ, ఉమారాణి, భాగ్యలక్ష్మితో పాటు 100 మందిమి ఉన్నాం.
మంత్రి: ఏ పంటలు పండిస్తారు
సమ్మమ్మ: రసాయన మందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాం. సేంద్రియ ఎరువులతో పంటలు పండించి మేము కొంత తీసుకొని మిగిలిన పంటలను అరణ్య సంస్థకు విక్రయిస్తున్నాం
మంత్రి: వ్యవసాయం లాభంగా ఉందా?.
సమ్మమ్మ: మేము చేసే వ్యవసాయం లాభంగా లేకపోయినా మంచి ఆహారం తీసుకుంటున్నాం. మాకు ఉన్న భూమిలో చెట్లు పెంచి మధ్యలో చిరుధాన్యాలు పండిస్తున్నాం.
మంత్రి: ఏ పంటలు పండిస్తున్నారు..?ఎలా పంచుకుంటున్నారు..?
సమ్మమ్మ: మాకు ఉన్న ఎకరా భూమిలో 10 రకాల పంటలు సాగు చేస్తున్నాం. ఎవరి భూమి లో వారు చిరుధాన్యాల పంటలు వేస్తున్నాం. బోర్ల ద్వారా చెట్లు పెంచుకుంటున్నాం. చెరుకు పంట సాగు చేస్తున్నాం.
మంత్రి: సమ్మమ్మ మీకు ఎలాంటి సహాయం కావాలి.?
సమ్మమ్మ: మేము పంటలు పండించేందుకు నీళ్లు లేవు. మాకు బోర్లు వేసి కరెంట్ సరఫరా చేయాలి సారూ.
మంత్రి: బోర్లు వేస్తే నీ రువస్తుందా.? సామూహిక బోర్లు వేస్తాం..
సమ్మమ్మ: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లు ఉచితంగా వేయాలి. కరెంట్, మోటార్లు అందించాలి.
మంత్రి: మీ వద్ద ఎన్ని బోర్లు ఉన్నాయి? 12 బోర్లు ఉన్నాయట కదా..?
సమ్మమ్మ: ఉన్నయి . అవి సరిపోవడం లేదు.. కొత్తగా బోర్లు వేయాలి సారు.
మంత్రి: తుల్జమ్మ మీరు మాట్లాడాలి.. మీరు పప్పులు ఎలా తయారు చేస్తారు.?
తుల్జమ్మ: పప్పుమిల్లు ఏర్పాటుకు సహాయం చేయాలి సారు.
మంత్రి: బోర్లు, బిందు సేద్యం పరికరాలు కావాలా?
తుల్జమ్మ: బోర్లు వేసి బిందు సేద్యం పరికరాలు అందించాలి. నీటి సౌకర్యం ఉన్న వారికి పరికరాలు సబ్సిడీపై సరఫరా చేయాలి.
మంత్రి: వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చెక్డ్యాంలు, ఊట చెరువు నిర్మాణం చేయాలి.
తుల్జమ్మ: వాన నీటిని నిల్వ చేస్తే బోర్లలో నీరు పెరుగుతుంది సారు.
మంత్రి: పప్పు మిల్లు, గోదాము మరమ్మతులు చేసేందుకు కృషి చేస్తాం.
తుల్జమ్మ: చెట్లకు నీరు పోసేందుకు ట్రాక్టరు, ట్యాంకరు కావాలి.
మంత్రి: కొన్ని రోజుల్లో కాళేశ్వరం నీటిని తెస్తాం, అప్పటి వరకు బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసుకొని చెట్లు పెంచుకోండి. పండించిన పంటలు అమ్ముకునేందుకు పటాన్చెరువు, సంగారెడ్డి, జహీరాబాద్లో ఉచితంగా దుకాణాలు కేటాయిస్తాం.
ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్, ఆందోల్ , నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి. రాష్ట్ర మౌలిక సదుపాయాల చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, వీరారెడ్డి, అరణ్య సంస్థ ప్రతినిధులు నరసన్న, కొప్పుల, పద్మతో పాటు మహిళలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.