పాపన్నపేట, అక్టోబర్17 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు గత 25 రోజులుగా అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించలేదు. శనివారం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిమట్టం తగ్గడంతో ఆదివారం చాలా రోజుల అనంతరం అమ్మవారి గర్భగుడి ప్రారంభించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.
అంతేకాకుండా దసరా సెలవులు ఉండడంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు
చెల్లించుకున్నారు.